గౌహతి : వరదలు వెల్లువెత్తుతున్న అసోం రాష్ట్రంలో కళాశాల జైలుగా మారిన ఘటన వెలుగుచూసింది. అసోం రాష్ట్రంలోని ధుబ్రీ జిల్లా జైలులో 401 మంది ఖైదీలున్నారు. అసోంలో కురుస్తున్న భారీవర్షాలతో నదులు పొంగి ప్రవహిస్తుండటంతో ధుబ్రీ జిల్లా జైలు వరదనీటిలో మునిగింది. దీంతో అర్దరాత్రి జైలులోని 401 మంది ఖైదీలను తాత్కాలికంగా ధుబ్రీ బాలికల కళాశాలకు తరలించారు. జిల్లా జైలులోకి వరదనీరు రావడంతో ముందుగా ఖైదీలను ధుబ్రీ గ్రంథాలయ భవనంలోకి మార్చాలని అధికారులు అనుకున్నారు. కాని వరదనీటిలో గ్రంథాలయం కాస్తా మునిగిపోవడంతో కళాశాలకు సెలవులు కావడంతో వెంటనే గంటన్నర సమయంలోగానే ఖైదీలందరినీ కళాశాల తరగతి గదుల్లోకి మార్చామని జైళ్ల శాఖ డీఐజీ రేణుక్ అలీ హజారికా చెప్పారు. కళాశాలలోకి కూడా వరదనీరు రావడంతో ఖైదీలందరినీ మొదటి అంతస్థులోని తరగతి గదుల్లోకి మార్చారు. వరదల నేపథ్యంలో ఖైదీలు పారిపోకుండా ఉండేలా జైళ్ల శాఖ బలగాలకు తోడు అదనంగా పోలీసులను నియమించారు. ఖైదీలున్న కళాశాల చుట్టూ పోలీసు పెట్రోలింగ్ ను ముమ్మరం చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm