అమరావతి : పరిపాలనా సౌలభ్యం, ప్రభుత్వ కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు ప్రజలకు సక్రమంగా అందించే లక్ష్యంతో రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటును పరిశీలిస్తున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ శాసనమండలిలో వెల్లడించారు. ఈ అంశంపై సభ్యులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. పార్లమెంటు నియోజకవర్గాల ప్రాతిపదికన జిల్లాల ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. అయితే జిల్లాల ఏర్పాటుకు ముందే ప్రజాభిప్రాయ సేకరణ చేయాలని సభ్యులు సూచించారు. కమిటీ ద్వారా అధ్యయనం చేయటం లేదా అఖిలపక్షం ద్వారా సలహాలు స్వీకరించాలని కోరారు. ప్రత్యేకంగా గిరిజన జిల్లా ఏర్పాటు చేసే క్రమంలో పరిపాలన సౌలభ్యంగా ఉండేలా జిల్లా కేంద్రాన్ని ఎంపిక చేయాలని ఎమ్మెల్సీలు సంద్యారాణి, సోము వీర్రాజు సూచించారు. గిరిజన నియోజకవర్గాలను కలిపే సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కొత్త జిల్లాలకు ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజు, ఫూలే వంటి మహనీయుల పేర్లు పెట్టాలని ఎమ్మెల్సీ రాము సూర్యారావు సూచించారు. అయితే కొత్త జిల్లాల ఏర్పాటు అంశం ఇంకా ప్రతిపాదన స్థాయిలోనే ఉందని మంత్రి బోస్ స్పష్టం చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm