హైదరాబాద్: ఆరు సీజన్లుగా అభిమానులను అలరిస్తున్న ప్రో కబడ్డీ లీగ్ 7వ సీజన్ నేటి నుంచి ప్రారంభం కానుంది. మొత్తం 12 జట్లు మూడు నెలలు పాటు టైటిల్ వేటలో పోటీ పడనున్నాయి. అక్టోబర్ 19న జరిగే పైనల్లో విజేత ఎవరో తెలిసిపోతుంది. ఐపీఎల్ తర్వాత అంతటి ఊపును తీసుకొచ్చిన ప్రొ కబడ్డీ లీగ్ కూత మరోసారి మోత మోగించనుంది. ప్రతీసారి ఏదో ఒక స్లోగన్ను లీగ్కు ఆకర్షణగా తెస్తున్న నిర్వాహకులు ఈసారి 'ఇస్ సే టఫ్ కుచ్ నహీ...(ఇంతకంటే క్లిష్టం మరోటి లేదు)' పేరుతో లీగ్కు ప్రచారం నిర్వహించారు.
సరిగ్గా ఐదేళ్ల క్రితం లీగ్ తెరపైకి వచ్చి అనూహ్యంగా సూపర్ సక్సెస్గా నిలిచిన ప్రో కబడ్డీ టోర్నీ విజయవంతంగా ఆరు సీజన్లు పూర్తి చేసుకుంది. ఈ ఏడాది జనవరి 5న ఆరో సీజన్ ఫైనల్ జరగ్గా అదే జోరులో 2019లో రెండో సారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. శనివారం గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో తెలుగు టైటాన్స్, యు ముంబా మధ్య జరిగే మ్యాచ్తో ప్రొ కబడ్డీ లీగ్ ప్రారంభమవుతుంది. గత సీజన్లాగే ఈసారి కూడా 12 జట్లు బరిలోకి దిగుతున్నాయి. ఈ లీగ్లో భారత ఆటగాళ్లతో పాటు పెద్ద సంఖ్యలో విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. అందరిలోకి అగ్రభాగం ఇరాన్దే. టైటాన్స్ కెప్టెన్ అబోజర్ సహా మొత్తం 15 మంది ఇరాన్ ఆటగాళ్లు ఉన్నారు. వీరితో పాటు బంగ్లాదేశ్, కెన్యా, నేపాల్, కొరియా, శ్రీలంక, థాయ్లాండ్కు చెందిన ఆటగాళ్లు పాల్గొంటున్నారు.
ఐపీఎల్ తరహాలో ప్రతీ జట్టు మరో టీమ్తో రెండేసి సార్లు తలపడుతుంది. అంటే ఒక్కో టీమ్ కనీసం 22 లీగ్ మ్యాచ్లు ఆడుతుంది. సొంత వేదికపై మాత్రం గరిష్టంగా నాలుగు మ్యాచ్లకు మించి ఏ జట్టుకూ ఆడే అవకాశం రాదు. లీగ్ దశ అనంతరం పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన ఆరు జట్లు బరిలో నిలిస్తే...తర్వాతి ఆరు జట్లు టోర్నీనుంచి తప్పుకుంటాయి. తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు నేరుగా సెమీఫైనల్కు అర్హత సాధిస్తాయి. మిగిలిన నాలుగు జట్లు రెండు ఎలిమినేటర్ మ్యాచ్లు ఆడి విజయం ద్వారా సెమీస్లో అడుగు పెట్టే అవకాశం ఉంది. సరిగ్గా మూడు నెలల సాగే ఈ లీగ్లో ఏకంగా 137 మ్యాచ్లు జరుగుతుండటం విశేషం. సీజన్1: జైపూర్ పింక్ పాంథర్స్, సీజన్ 2 యు ముంబా, సీజన్3,4,5 పాట్నా పైరెట్స్, సీజన్ 6 బెంగళూరు బుల్స్ జట్లు విజేతలుగా నిలిచాయి. లీగ్లో ఆరు సీజన్లలో పట్నా పైరేట్స్ జట్టు దూకుడు కొనసాగింది. ఏకంగా మూడు సార్లు ఆ జట్టు విజేతగా నిలవడం విశేషం. 12 జట్లు తమ సొంత వేదికలను ఎంచుకున్నాయి. గత సీజన్లో తెలంగాణలో ఎన్నికల కారణంగా వైజాగ్లో హోం మ్యాచ్లు ఆడిన తెలుగు టైటాన్స్ ఈసారి హైదరాబాద్నే సొంత వేదికగా తీసుకుంది. దీంతో పాటు ముంబై, పట్నా, అహ్మదాబాద్, చెన్నై, న్యూఢిల్లీ, బెంగళూరు, కోల్కతా, పుణే, జైపూర్, పంచకుల, గ్రేటర్ నోయిడాలలో మ్యాచ్లు జరుగుతాయి. ప్రతి మంగళవారం మ్యాచ్లకు విశ్రాంతి దినం. శని, ఆది, బుధ, శుక్రవారాల్లో హోం జట్లు తమ మ్యాచ్లను ఆడతాయి.
తెలుగు టైటాన్స్ కెప్టెను సిద్ధార్థ్ దేశాయ్: వేలంలో రూ.1.45 కోట్ల భారీ మొత్తం చెల్లించి మరీ సిద్ధార్థ్ను సొంతం చేసుకుంది టైటాన్స్. అతడిపై తెలుగు అభిమానులకు భారీ ఆశలు, భారీ అంచనాలు ఉన్నాయి. గత సీజన్లోనే పీకేఎల్లో అడుగుపెట్టిన అతను అరంగేట్రంలోనే యు ముంబా తరపున 21 మ్యాచ్ల్లో 218 రైడ్ పాయింట్లు సాధించాడు. రైడింగ్లో సిద్ధార్థే జట్టుకు కీలకం అవుతాడనడంలో సందేహం లేదు. ఐతే రైడింగ్లో టైటాన్స్ జట్టు పాత పొరపాట్లనే మళ్లీ చేస్తోంది. ఒకే ఆటగాడిపై ఎక్కువగా ఆధారపడుతోంది. గతంలో రాహుల్.. ఇప్పుడేమో సిద్ధార్థ్. రైడింగ్ విభాగంలో సిద్ధార్థ్కు గొప్ప సహకారం అందించే చెప్పుకోదగ్గ ఆటగాళ్లు కనిపించడం లేదు. సిద్ధార్థ్ అన్న సూరజ్ దేశాయ్తో పాటు యువ ఆటగాడు రాకేశ్ ఎలాంటి ప్రదర్శన చేస్తారో చూడాలి.
రాహుల్ చౌదరి(26): ప్రొ కబడ్డీ లీగ్లో అతనో ప్రత్యేక ఆకర్షణ. ఏ సీజన్లోనైనా అందరి దృష్టి అతనిపైనే. అతనే రైడ్ మిషన్ అని అభిమానులు ముద్దుగా పిలుచుకొనే రాహుల్ చౌదరి. ప్రో కబడ్డీ లీగ్ ప్రారంభం నుంచి గత ఆరు సీజన్లలో తెలుగు టైటాన్స్ తరపున ప్రధాన రైడర్గా బరిలో దిగి.. తనదైన మాయతో టోర్నీకే ఆకర్షణ తెచ్చాడు. పాయింట్ల పట్టికల్లో మొదటి స్థానంలో నిలిచాడు. ఉత్తర ప్రదేశ్కు చెందిన ఈ రైడర్ తెలుగు అభిమానులకు ఎంతో చేరువయ్యాడు. ఐతే ఈ సీజన్లో అతను తమిళ్ తలైవాస్ తరపున బరిలో దిగనున్నాడు. వేలంలో అతణ్ని ఆ జట్టు సొంతం చేసుకుంది. 876 పాయింట్లతో పీకేఎల్ చరిత్రలో అత్యధిక పాయింట్లు సాధించిన ఆటాడిగా ఉన్న రాహుల్ ఈ సీజన్తో 1000 పాయింట్లకు చేరువయ్యేలా కనిపిస్తున్నాడు.
పర్దీప్ నర్వాల్(22): పీకేఎల్లో పట్నా పైరేట్స్ది గొప్ప చరిత్ర. మూడో సీజన్లో ఆరంభమైన ఆ జట్టు టైటిళ్ల యాత్ర ఐదో సీజన్ వరకూ కొనసాగింది. ఆ జట్టు హ్యాట్రిక్ టైటిళ్లు సాధించడంలో ప్రధాన పాత్రధారి.. పర్దీప్ నర్వాల్. మూడు, ఐదో సీజన్లలో ఉత్తమ రైడర్తో పాటు ఉత్తమ ఆల్రౌండర్గా నిలిచిన అతను జట్టును ముందుండి నడిపించాడు. ఇప్పటి వరకు 858 రైడ్ పాయింట్లతో ఆ జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఐదో సీజన్లో 369 రైడ్ పాయింట్లు సాధించి ఒక సీజన్లో అత్యధిక రైడ్ పాయింట్లు గెలిచిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. డుబ్కీతో పాయింట్లు రాబట్టడంలో దిట్టగా పేరొందిన అతనిపైనే పట్నా మరోసారి ఆశలు పెట్టుకుంది.
దీపక్ నివాస్ హుడా(25): ప్రత్యర్థి డిఫెండర్లను బోల్తా కొట్టిస్తారు.. కోర్టులో అడుగుపెట్టిన రైడర్ను పట్టేస్తారు.. వాళ్లే ఆల్రౌండర్లు దీపక్ నివాస్ హుడా, మంజీత్ చిల్లర్. రైడింగ్లో, ఎటాకింగ్లో సత్తాచాటుతూ దూసుకెళ్తున్నారు. జైపుర్ పింక్ పాంథర్స్ తరపున ఆకట్టుకుంటోన్న దీపక్ ఇప్పటి వరకు పీకేఎల్ కెరీర్లో 710 రైడ్ పాయింట్లతో పాటు 75 ట్యాకిల్ పాయింట్లు సాధించాడు. గత సీజన్లో (196 రైడ్, 12 ట్యాకిల్ పాయింట్లు) మంచి ఫామ్ కనబరచిన దీపక్ ఈ సారి కూడా అదే జోరు కొనసాగించాలనే పట్టుదలతో ఉన్నాడు. మరోవైపు పీకేఎల్ చరిత్రలో అత్యధిక ట్యాకిల్ పాయింట్లతో ఉన్న మంజీత్ చిల్లర్ (302) తమిళ్ తలైవాస్ జట్టుకు కీలకం. రైడర్ కాళ్లపై నిశితమైన దృష్టి పెట్టి ఉడుంపట్టు పట్టే మంజీత్కు డిఫెన్స్లో తిరుగులేదు. రైడింగ్లోనూ పాయింట్లతో మెరవగలడు.
ఫజల్ అత్రాచలి(21): భారతీయ క్రీడ కబడ్డీకి ఇరానీ ఘాటు గట్టిగానే తగులుతోంది. ఏడో సీజన్లో పీకేఎల్ జట్లకు ప్రాతినిథ్యం వహించే ఆ దేశ ఆటగాళ్ల సంఖ్య చూస్తే ఆ విషయం అర్థమౌతోంది. ఇప్పటికే ఫజల్ అత్రాచలి యు ముంబాకు, అబోజర్ మొహాజర్ మిఘాని టైటాన్స్ జట్లకు కెప్టెన్లుగా ఎంపికైన సంగతి తెలిసిందే. మిరాజ్ షేక్ ఎప్పటి నుంచో పీకేఎల్లో మెరుస్తూనే ఉన్నాడు. వీళ్లు కాకుండా డిఫెండర్లు.. సయ్యద్ గఫారి (దబంగ్ దిల్లీ), హాది తాజిక్ (పుణెరి పల్టాన్), మిలాద్ షీబాక్ (తమిళ్ తలైవాస్), ఆల్ రౌండర్లు. మహమ్మద్ ఇస్మాయిల్ నబిబాక్ష్ (బెంగాల్ వారియర్స్), హాది ఓష్టోరాక్ (పట్నా పైరేట్స్), రహిమి మిలాఘర్డాన్ (తెలుగు టైటాన్స్), మోసెన్ (యూపీ యోధ) బరిలో దిగేందుకు సిద్ధమయ్యారు.
సీజన్-7 కెప్టెన్లు వీరే...
- మణీందర్ సింగ్ (బెంగాల్ వారియర్స్)
- జోగీందర్ నర్వాల్ (దబంగ్ ఢిల్లీ)
- సునీల్ కుమార్ (గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్)
- రోహిత్ కుమార్ (బెంగళూరు బుల్స్)
- దీపక్ హుడా (జైపూర్ పింక్ పాంథర్స్)
- పర్దీప్ నర్వాల్ (పట్నా పైరేట్స్)
- సుర్జీత్ సింగ్ (పుణేరీ పల్టన్)
- అజయ్ ఠాకూర్ (తమిళ్ తలైవాస్)
- అబోజర్ మొహాజిర్ మిగాని (తెలుగు టైటాన్స్)
- నితీశ్ కుమార్ (యూపీ యోధ)
- ఫజల్ అత్రచలి (యు ముంబా)
- ధర్మరాజ్ చేరలతన్ (హరియాణా స్టీలర్స్)
లీగ్ టాపర్స్
అత్యధిక పాయింట్లు: రాహుల్ చౌదరి (876)
అత్యధిక రైడ్ పాయింట్లు: పర్దీప్ నర్వాల్ (858)
అత్యధిక టాకిల్ పాయింట్లు: మన్జీత్ ఛిల్లర్ (302)
ఎక్కువ సార్లు ప్రత్యర్థిని ఆలౌట్: పట్నా పైరేట్స్ (165)
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Jul 20,2019 05:08PM