హైదరాబాద్ : టీమిండియా వికెట్ కీపర్ మహేంద్రసింగ్ ధోనీ ప్రస్తుతానికి రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం లేదని, వచ్చే నెలలో జరిగే వెస్టిండీస్ పర్యటనకు మాత్రం దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. ధోనీ స్వయంగా ఈ విషయాన్ని తమ దృష్టికి తీసుకొచ్చాడని ఓ బీసీసీఐ ఉన్నతాధికారి జాతీయ వార్తా సంస్థతో పేర్కొన్నట్లు వార్తలు వచ్చాయి. సెలెక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం ముంబయిలో జరిగే కీలక సమావేశంలో విండీస్ పర్యటనకు వెళ్లే జట్టుని ప్రకటించనున్నారు. ఈ నేపథ్యంలోనే ధోనీ తన నిర్ణయాన్ని వెల్లడించినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై అటు ధోనీ .. ఇటు బీసీసీఐ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో ఉన్న మాజీ కెప్టెన్ ధోనీ తదుపరి రెండు నెలలూ తన పారామిలిటరీ రెజిమెంట్తో కలిసి పనిచేస్తాడని అధికారి స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. చాలా కాలం ముందే ధోనీ ఈ నిర్ణయం తీసుకున్నాడని.. అందువల్లే విండీస్ పర్యటనకు దూరంగా ఉంటున్నాడని ఆయన చెప్పుకొచ్చారు. ఈ విషయాన్ని కెప్టెన్ విరాట్కోహ్లీతో సహా సెలెక్షన్ కమిటీ ఛైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్కు ఆ అధికారి తెలియజేసినట్లు సమాచారం. ధోనీ స్థానంలో రిషభ్పంత్కు వికెట్కీపింగ్ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది.
Mon Jan 19, 2015 06:51 pm