హైదరాబాద్: తెలుగు రియాలిటీ షో బిగ్బాస్-3 మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. ఇప్పటికీ ఈ షో వివాదాలకు మాత్రం ఫుల్స్టాప్ పడలేదు. రోజురోజుకూ ఈ షోపై వివాదాలు ముదురుతూనే ఉన్నాయి. కాగా.. తనను బిగ్బాస్ కంటెస్టెంట్గా తీసుకుని అగ్రిమెంట్ కూడా చేయించుకుని చివరికి మోసం చేశారని ప్రముఖ యాంకర్ శ్వేతారెడ్డి పోలీస్ స్టేషన్లు, కోర్టు మెట్లెక్కిన విషయం విదితమే. అయితే ఇప్పటి వరకూ ఈ కేసు ఎందాకా వచ్చింది..? పోలీసులు ఏం చేశారన్న విషయం మాత్రం తెలియరాలేదు. ఈ వివాదంపై తాజాగా.. శ్వేతారెడ్డి హైదరాబాద్లోని సోమాజిగూడ ప్రెస్క్లబ్లో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పలు ఆసక్తికర, సంచలన విషయాలను బయటపెట్టడంతో పాటు నటి హేమపై షాకింగ్ కామెంట్స్ చేశారు. కాగా బిగ్బాస్ షో వివాదంపై ఇప్పటికే నటి హేమ స్పందిస్తూ నాగ్ అలాంటి వ్యక్తి కాదని.. అనవసరంగా ఈ షోపై వివాదం రేపొద్దని చెప్పిన విషయం తెలిసిందే. అంతేకాదు హేమ హౌస్లోకి కంటెస్టెంట్గా వెళ్తున్నట్లు పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. అయితే హేమ గురించి శ్వేతారెడ్డి మాట్లాడుతూ.. ఆమె లాగా బిగ్బాస్ షోకి వెళ్ళాలనే కక్కుర్తి తనకు లేదన్నారు. కమిట్మెంట్లు, అగ్రిమెంట్లు మీకు పరిపాటి అయ్యుండొచ్చని ఆమె వ్యాఖ్యానించారు. బిగ్బాస్ షోతో బలైన మహిళలు బయటికి వచ్చి మాట్లాడాలని ఈ సందర్భంగా ఆమె పిలుపునిచ్చారు. తెలంగాణ సంస్కృతిని దెబ్బ తీయడానికి ప్రయత్నిస్తే తనలాంటి జర్నలిస్ట్లు ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ వెంటనే ఈ అంశంపై దృష్టి పెట్టాలని విజ్ఞప్తి చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm