అమరావతి: గ్రామ సచివాలయాల తరహాలోనే పట్టణ ప్రాంతాల్లోనూ వార్డు సచివాలయాల ఏర్పాటుకు విధివిధానాలను ఖరారు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా పురపాలికలు, నగరపాలికల్లో 3,775 వార్డు సచివాలయాల ఏర్పాటుకు పురపాలక శాఖ ఆదేశాలు ఇచ్చింది. ప్రతి నాలుగు వేల మంది జనాభాకూ ఓ వార్డు సచివాలయాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఒక్కో సచివాలయంలో 10 మంది ఉద్యోగులను నియమించేలా విధివిధానాల్ని రూపొందించారు. ప్రభుత్వ విధానమైన నవరత్నాలను సక్రమంగా అమలుపరచడంతో పాటు ప్రభుత్వ సేవలను పౌరులకు మరింత చేరువ చేయడమే లక్ష్యంగా ఈ వార్డు సచివాలయాలను ఏర్పాటు చేయనున్నట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది. వార్డు కార్యాలయం, అంగన్వాడీ భవనాలు, పాఠశాల లేదా ఇతర ప్రభుత్వ భవనాల్లో వేటిలోనైనా వార్డు సచివాలయం ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించింది. జూలై 22 తేదీన నియామకాల నోటిఫికేషన్ చేపట్టి ఆగస్టు 16 తేదీ నుంచి సెప్టెంబరు 15 లోగా నియామకాలను పూర్తి చేయనున్నారు. అక్టోబరు రెండో తేదీ నుంచి గ్రామ సచివాలయాలతో పాటు పట్టణ ప్రాంతాల్లో వార్డు సచివాలయాలు పనిచేయనున్నాయి.
Mon Jan 19, 2015 06:51 pm