న్యూఢిల్లీ: కర్ణాటక రాజకీయాలపై సుప్రీం కోర్టు స్పందించింది. ఇవాళ, రేపట్లో అసెంబ్లీలో బలపరీక్ష జరుగుతుందని ఆశిస్తున్నట్టు తెలిపింది. స్పీకర్ కావాలనే బలపరీక్షను వాయిదా వేస్తున్నారని ప్రధాన న్యాయమూర్తి దృష్టికి రెబల్స్ లాయర్ తీసుకొచ్చారు. అయితే ప్రస్తుతం చర్చ జరుగుతుండగా తాము ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని సుప్రీం ధర్మాసనం పేర్కొంది. బలపరీక్ష జరగని పక్షంలో రేపు విచారిస్తామని తెలిపింది. అనంతరం కర్ణాటక పిటిషన్పై విచారణను సుప్రీం కోర్టు బుధవారానికి వాయిదా వేసింది. విశ్వాస తీర్మానంపై విధానసభలో ప్రస్తుతం చర్చ జరుగుతోంది. సభలో 70 మంది ఎమ్మెల్యేలున్నారు. సీఎం కుమారస్వామి, కాంగ్రెస్ పక్షనేత సిద్ధరామయ్య సభకు ఇంకా చేరుకోలేదు. మాజీ ప్రధాని, జేడీఎస్ అధ్యక్షుడు దేవెగౌడతో సీఎం కుమారస్వామి సంప్రదింపులు జరుపుతున్నారు. అనంతరం సిద్ధరామయ్యతో కుమారస్వామి భేటీ కానున్నట్టు సమాచారం. సాయంత్రం 4 గంటల తర్వాతే బలపరీక్ష ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
Mon Jan 19, 2015 06:51 pm