హైదరాబాద్: కశ్మీర్ సమస్యపై మధ్యవర్తిత్వం చేయాలంటూ ట్రంప్ను మోడీ కోరినట్లు వస్తున్న వార్తలపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ స్పందించారు. ట్రంప్తో కశ్మీర్ సమస్యపై మోడీ ఏం మాట్లాడారో .. ఆ విషయాన్ని ఆయన వెల్లడించాలని రాహుల్ తన ట్విట్టర్లో డిమాండ్ చేశారు. భారత్, పాక్ మధ్య ఉన్న కశ్మీర్ సమస్యపై మధ్యవర్తిత్వం చేయాలని మోడీనే కోరినట్లు ట్రంప్ తెలిపారు. దీనిపై ప్రతిపక్షాలు ఇవాళ పార్లమెంట్లో ఆందోళన కూడా చేపట్టాయి. ఒకవేళ ఇదే నిజమైతే.. భారత విశ్వాసాలను మోడీ దెబ్బతీశారని రాహుల్ అన్నారు. 1972లో కుదిరిన సిమ్లా ఒప్పందాన్ని కూడా ఉల్లంఘించినట్లు అవుతుందని ఆరోపించారు. ప్రధాని అలా మాట్లాడలేదని విదేశాంగ శాఖ అంటే సరిపోదు అని, అమెరికా అధ్యక్షుడు ట్రంప్, మోడీ మధ్య కశ్మీర్ గురించి జరిగిన చర్చ వివరాలను వెల్లడించాల్సిందే అని రాహుల్ అన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm