హైదరాబాద్: బంగ్లాదేశ్కు చెందిన 25 ఏళ్ల యువతి తల్లికి తన కిడ్నీని దానంగా ఇచ్చేందుకు తన ప్రియుడితో చేసుకున్న నిశ్చితార్థాన్ని రద్దు చేసుకున్న ఘటన బెంగళూరులో వెలుగుచూసింది. బంగ్లాదేశ్ కు చెందిన ఓ మహిళకు రెండు కిడ్నీలు చెడిపోవడంతో కిడ్నీ మార్పిడి చికిత్స కోసం బెంగళూరు నగరంలోని మణిపాల్ ఆసుపత్రికి వచ్చింది. ఈ మహిళ కుమార్తె అయిన 25 ఏళ్ల యువతి తన ప్రియుడితో ఈ నెల 21వతేదీన నిశ్చితార్థం చేసుకోవాలని నిర్ణయించుకుంది. కాని తల్లికి రెండు కిడ్నీలు చెడిపోయి అనారోగ్యంగా ఉండటంతో తల్లికి తనకున్న రెండు కిడ్నీల్లో ఒక దాన్ని దానంగా ఇవ్వాలని నిర్ణయించుకుంది. తల్లికి కిడ్నీ ఇస్తాననడంతో కాబోయే భర్త అయిన వరుడు దాన్ని వ్యతిరేకించాడు. అంతే ప్రియుడితో తనకు పెళ్లి వద్దని, నిశ్చితార్థం కార్యక్రమాన్ని రద్దు చేసుకొని బెంగళూరుకు వచ్చి తల్లికి తన కిడ్నీని దానం చేసిందని నెఫ్రాలజిస్ట్ డాక్టర్ సుందర్ చెప్పారు. తల్లికి కిడ్నీని దానంగా ఇచ్చేందుకు నిశ్చితార్థాన్ని రద్దు చేసుకున్న బంగ్లాదేశ్ యువతిని సోషల్ మీడియాలో పలువురు నెటిజన్లు ప్రశంసించారు. తల్లి కోసం పెళ్లి కాదనుకున్న కూతురు ఉండటం తల్లిదండ్రులు ఎంతో అదృష్టవంతులని మణిపాల్ ఆసుపత్రి ఛైర్మన్ డాక్టర్ సుదర్శన్ బల్లాల్ చెప్పారు.
Mon Jan 19, 2015 06:51 pm