హైదరాబాద్: రాష్ట్రంలో త్వరలోనే ప్రైవేటు యూనివర్సిటీలు రాబోతున్నాయి. ఈ మేరకు ఉన్నత విద్యాశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కొన్ని రాష్ట్రాల్లో కొనసాగుతున్న ప్రైవేటు వర్సిటీలకు దీటుగా..రాష్ట్రంలో ప్రైవేటు వర్సిటీలను తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. వర్సిటీల ఏర్పాటుకు గ్రామీణ ప్రాంతాల్లో 20 ఎకరాలు, పట్టణ ప్రాంతాల్లో 10 ఎకరాల చొప్పున భూమి ఉండాలని, కార్పస్ ఫండ్ కింద రూ.10 కోట్లు ఉండాలన్న నిబంధనలు ఉన్నాయని రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి తెలిపారు. దీనిపై మార్గదర్శకాలు రూపొందిస్తున్నారని, ప్రభుత్వ ఆమోదం పొందాక ప్రైవేటు వర్సిటీల ఏర్పాటుకు దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ జారీచేస్తామని చెప్పారు. వచ్చే విద్యాసంవత్సరానికి ప్రైవేటు యూనివర్సిటీలు ఏర్పాటయ్యేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, మార్కెట్ డిమాండ్కు అనుగుణంగా భవిష్యత్తు అవసరాలు తీర్చగలిగే కోర్సులతో కొత్త వర్సిటీల ఏర్పాటవుతాయని వివరించారు.
Mon Jan 19, 2015 06:51 pm