పుణె: సైనికులు తమ ప్రాణాలను ఫణంగా పెట్టి దేశానికి సేవ చేస్తారు. వారి త్యాగాలు దేశానికి ఎంతో విలువైనవి.. చిరస్మరణీయమైనవి. సైనికులు దేశం కోసం ప్రాణాలు అర్పించినప్పుడు మనం తిరిగి వారికి ఏం ఇవ్వగలం? వారి త్యాగాలను స్మరించుకోవడం తప్ప. అదే మనం వారికిచ్చే గొప్ప కానుక. ఈ ఏడాది ఫిబ్రవరిలో పుల్వామాలో ఉగ్రవాదులు బాంబు దాడిచేసి 40 మంది సీఆర్పీఎఫ్ సైనికులను బలితీసుకున్న విషయం తెలిసిందే. అయితే, ఆ ఘటనలో అమరులైన సైనికుల త్యాగాలకు చిహ్నంగా వారిని ఖననం చేసిన మట్టితో పుల్వామాలో భారత మ్యాప్ ఆకారంలో స్మారక చిహ్నం నిర్మించేందుకు ఓ కళాకారుడు ముందుకొచ్చారు. మహారాష్ట్రలోని ఔరంగాబాద్కు చెందిన ఉమేష్ జాదవ్ అనే కళాకారుడు తాను తలపెట్టిన కార్యక్రమంలో భాగంగా మరణించిన ప్రతి జవాను ఇంటికి తిరిగి వారిని ఖననం చేసిన మట్టిని సేకరించే పనిని ప్రారంభించారు. అతడు ఈ ప్రయాణాన్ని ఏప్రిల్ 9న ప్రారంభించారు. పుల్వామా ఘటన జరిగి సంవత్సరం పూర్తయ్యేలోపు స్మారక చిహ్నం పూర్తి చేయాలని సంకల్పించారు. దీనిలో భాగంగా మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక, పుదుచ్చేరి ఇలా అన్ని రాష్ట్రాలకు చెందిన అమరుల గ్రామాలకు వెళ్లి అక్కడ నివాళులర్పించి మట్టిని సేకరిస్తున్నారు. ఈ పర్యటనలకు ఉపయోగిస్తున్న ప్రత్యేక కారుపై కూడా సీఆర్పీఎఫ్ సైనికులకు సంబంధించిన నినాదాలు, బొమ్మలు ఉన్నాయి. ఒక కళాకారుడిగా తాను వారి త్యాగాలకు చేయగలిగేది చేస్తున్నానని ఉమేశ్ మీడియాకు తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm