హైదరాబాద్ : ఓ పాము హైదరాబాద్ మెట్రో రైల్లోకి దూరింది. ఆ పాము 2,500 కిలోమీటర్లు ప్రయాణించింది. అంటే దాదాపు 80 ట్రిప్పులకు పైగానే తిరిగింది. 80 ట్రిప్పులు అంటే.. 6 రోజుల పాటు ఆ రైల్లోనే పాము బస చేసిందన్న మాట. వివరాల్లోకి వెళ్తే.. ఆగస్టు 14వ తేదీన డీబీ031 నంబర్ గల రైలు.. ఎల్బీనగర్ నుంచి మియాపూర్కు బయల్దేరింది. దిల్సుఖ్నగర్ రాగానే పైలట్ డ్యాష్బోర్డులో ఓ పాము కనిపించింది. దీంతో అప్రమత్తమైన పైలట్.. ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్ సొసైటీ సభ్యులకు సమాచారం అందించాడు. వారు అక్కడికి చేరుకునే లోపే పాము కనిపించకుండా పోయింది. రైల్లోని పైలట్ క్యాబిన్లో ఎంత పరిశీలించిన పాము ఆచూకీ లభించలేదు. అయితే మళ్లీ ఆగస్టు 19వ తేదీన దిల్సుఖ్నగర్ రాగానే పాము మళ్లీ అదే పైలట్ క్యాబిన్లో ప్రత్యక్షమైంది. దీంతో రైలును ఎల్బీనగర్కు తీసుకెళ్లి.. ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్ సొసైటీ సభ్యులకు సమాచారం ఇచ్చారు. ఈసారి వారు పామును పట్టుకున్నారు. ఈ పాము వల్ల పెద్ద ప్రమాదం ఉండదని స్నేక్ సొసైటీ సభ్యులు తెలిపారు. అనంతరం అటవీ శాఖ అధికారుల సహాయంతో పామును అడవిలో వదిలేశారు.
Mon Jan 19, 2015 06:51 pm