లక్నో: ఉత్తరప్రదేశ్లో బీజేపీ పాలన ఆటవికంగా ఉందని మాయావతి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పెట్రోల్, డీజిల్లపై ధరలు అధికం చేసి పేద, మధ్య తరగతి వర్గాల కడుపులపై తన్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం చేసే ప్రతి చిన్న తప్పిదానికి అధికారులను బలిపశువులను చేస్తూ తాము తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ట్విట్టర్ ద్వారా యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంపై మాయావతి నిప్పులు చెరిగారు. బీజేపీ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను విపరీతంగా పెంచడంతో ద్రవ్యోల్బనం పెరిగింది. పేద, మధ్య తరగతి వర్గాల వారికి పెట్రోల్, డీజిల్ కొనుగోలు ఇబ్బందిగా మారింది. అధ్వాన్నమైన శాంతిభద్రతలు, తీవ్ర ద్రవ్యోల్బనం వీటికి తోడు విపరీతమైన నిరుద్యోగం.. వీటి వల్ల ప్రజలు అనేక ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం ప్రజా సమస్యలపై దృష్టి పెడితే మంచిది. నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిక్షణలో బీజేపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. తప్పుడు విధానాలతో యూపీలో ఆటవిక పాలన కొనసాగుతోంది. ఇందుకోసం అధికారులను బలిపశువులను చేస్తున్నారు. నేరస్తులకు రక్షణ ఇవ్వడం మానేయాలి. ప్రజా ప్రయోజనాలకు ఇది చాలా ముఖ్యమని గ్రహించాలి అని మాయావతి ట్వీట్ చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm