హైదరాబాద్ : నటుడు ప్రభాస్ హీరోగా తెరకెక్కించిన చిత్రం 'సాహో'. ఈ సినిమాలో బాలీవుడ్ నాయకుడు నీల్ నితిన్ ముఖేష్ విలన్ గా నటిస్తున్నాడు. ఈ మూవీకి సుజీత్ దర్శకుడు. శ్రద్ధా కపూర్ హీరోయిన్. జాకీ ష్రాఫ్, మురళీ శర్మ, వెన్నెల కిశోర్, మందిరా బేడీ, అరుణ్ విజయ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. తెలుగుతోపాటు తమిళం, హిందీ భాషల్లో ఈ సినిమా ఆగస్టు 30న విడుదల కాబోతోంది. సుజీత్ ఈ చిత్రం కథను తనకు నరేట్ చేసిన తర్వాత చాలా రోజుల వరకూ తనకు పిలుపురాలేదని నీల్ నితిన్ ముఖేష్ తాజాగా మీడియాకి తెలిపాడు. దీంతో సినిమా నుంచి తనను తీసేశారేమో అని భయపడ్డట్లు చెప్పారు. 'ఓ అవార్డు ఫంక్షన్లో సుజీత్ను కలిశా. కొన్ని రోజుల తర్వాత ఆయన నన్ను కలిసి, 'సాహో' కథ నరేట్ చేశారు. నాకు పాత్ర నచ్చింది. 'బాహుబలి' సినిమా (2015) విడుదల కాకముందు జరిగిన సంఘటన ఇది. ఈ సినిమా బ్లాక్బస్టర్ అయిన తర్వాత ప్రభాస్ కోసం మేమంతా రెండేళ్లు ఎదురుచూశాం. అప్పుడు ఆయన 'బాహుబలి 2' సినిమా షూటింగ్లో ఉన్నారు. ఈ గ్యాప్లో నేను ఇతర సినిమాల్లో నటించా. ఆ సమయంలో 'సాహో' నుంచి నన్ను తీసేశారేమో అని భయపడ్డా. కానీ సుజీత్ తన మాట నిలబెట్టుకున్నాడని చెప్పాడు.
Mon Jan 19, 2015 06:51 pm