హైదరాబాద్ : గత మూడు రోజులుగా హిమాచల్ ప్రదేశ్ లో గ్యాప్ లేకుండా వర్షాలు పడుతూనే ఉన్నాయి. భారీ వరదలు, కొండ చరియలు విరిగి పడుతుండడం, రోడ్లు కొట్టుకుపోతుండడంతో జనాలు బాగా ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలో మలయాళ నటి మంజు వారియర్ తో పాటు చిత్రబృందం హిమాచల్ ప్రదేశ్ వరదల్లో చిక్కుకున్నారు. దాదాపు ముప్పై మంది ఉన్న ఈ బృందం చట్రూ అనే కొండ ప్రాంతంలో చిక్కుకుపోయారు. సనల్ కుమార్ శశిధరన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ కోసం వీరంతా హిమాచల్ ప్రదేశ్ వెళ్లారు. అయితే భారీ వరదన కారణంగా షూటింగ్ జరుగుతున్న ప్రాంతంలో రోడ్డు కొట్టుకుపోవడంతో మంజుతో పాటు ఇతర సభ్యులు అక్కడే చిక్కుకుపోయారు. ఈ విషయాన్ని మంజు వారియర్ శాటిలైట్ ఫోన్ ద్వారా తన సోదరుడు మధుకి తెలిపింది. దీంతో అతడు విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లాడు. ఆయన ఆదేశాల ప్రకారం మంజు వారియర్, చిత్రబృందాన్ని సురక్షిత ప్రాంతానికి చేర్చారు. ప్రస్తుతం అక్కడ టెలిఫోన్, సెల్ ఫోన్ లైన్స్ ఏం పని చేయడం లేదని.. సోమవారం రాత్రి తన సోదరి ఫోన్ చేసి క్షేమంగా ఉన్నామని చెప్పినట్లు మధు వెల్లడించాడు. అయితే వారందరికీ సరిపడా ఆహరం లేదని.. కేవలం ఒక్క రోజుకు మాత్రమే సరిపోయే ఆహరం ఉందని.. సాయం అందేలా చూడమని కోరినట్లు తెలిపారు. ఈ విషయాన్ని మధు కేరళ జూనియర్ విదేశాంగ మంత్రి వి.మురళీధరన్ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన సహాయం చేస్తానని హామీ ఇచ్చారు.
Mon Jan 19, 2015 06:51 pm