హైదరాబాద్ : తెలుగు పాటకు కొత్త పరిమళాన్ని అద్దిన గాయనిగా పి.సుశీల పేరు తెచ్చుకున్నారు. ఎంతోమంది సంగీత దర్శకులతో కలిసి ఆమె పని చేశారు .. ఎన్నో వేల పాటలకు ప్రాణం పోశారు. అలాంటి సుశీల గురించి సీనియర్ జర్నలిస్ట్ బీకే ఈశ్వర్ మాట్లాడుతూ .. 'సుశీలగారు తెలుగుతో పాటు తమిళంలోను ఎన్నో పాటలు పాడారు. ఒకసారి ఆమె ఓ తమిళ సినిమాకి పాట పాడటానికి రికార్డింగ్ థియేటర్ కి వెళ్లారు. ఆ పాటను ఆమె ఏపీ కోమలిగారితో కలిసి పాడవలసి వుంది. కోమలి గారు కర్ణాటక సంగీతంలో నిష్ణాతురాలు. ఆ తమిళ సినిమాలో గురువు పాత్రకి తనతో .. శిష్యురాలి పాత్రకి కోమలిగారితో పాడించనున్నారనే విషయం అక్కడికి వెళ్లిన తరువాతనే సుశీలగారికి తెలిసింది. కర్ణాటక సంగీతంలో నిష్ణాతురాలైన కోమలిగారిని శిష్యురాలి పాత్రకి పాడించడమేంటి? ఆ శిష్యురాలికి గురువు పాత్రకి నేను పాడటమేంటి? అసలు ఇలా ప్లాన్ చేసినవారెవరు? అంటూ సుశీలగారు అసహనాన్ని వ్యక్తం చేశారు. ఇది కోమలిగారిని అవమానించడమే అవుతుంది .. ఈ పాటను నేను పాడను' అంటూ ఆమె కోపంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు' అని చెప్పుకొచ్చారు.
Mon Jan 19, 2015 06:51 pm