హైదరాబాద్: అమీర్పేట మెట్రో ప్రమాదంపై ప్రభుత్వం సీరియస్ అయింది. ఇంజినీరింగ్ నిపుణులతో విచారణ జరిపించాలని మంత్రి కేటీఆర్ ఆదేశించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కేటీఆర్ ఆదేశించారు. వర్షం నుంచి తడవకుండా ఉండేందుకు మౌనిక అనే వివాహిత అమీర్పేట్ మెట్రో పిల్లర్ కిందకు వెళ్లింది. కొద్దిసేపటికే పైనుంచి పెచ్చులు ఊడి నేరుగా ఆమె తలపై పడ్డాయి. పెచ్చుల ధాటికి ఆమె తల పగిలింది. తీవ్ర గాయాలతో అక్కడిక్కడే కుప్పకూలి రక్తపుమడుగులో గిలగిలాకొట్టుకుంది. వెంటనే ఆస్పత్రికి తరలించినా అప్పటికే ఆమె ప్రాణాలు విడిచింది. మృతురాలిని కూకట్పల్లిలో నివాసం ఉంటున్న మౌనికగా గుర్తించారు. స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం మౌనిక స్వస్థలం మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్. భర్త కంతాల హరికాంత్రెడ్డి. ఏడాది క్రితమే వీరికి పెళ్లయింది.
Mon Jan 19, 2015 06:51 pm