న్యూఢిల్లీ: భారతదేశ ప్రతీకలు మహాత్మగాంధీ, జవహర్లాల్ నెహ్రూలేనని అల్కాలంబ అన్నారు. మోడీ అమెరికా పర్యటనలో భాగంగా అమెరికా కాంగ్రెస్ నేత స్టానీ హోయర్ మాట్లాడుతూ 'గాంధీ ఆశయాలు-నెహ్రూ విజన్ నెరవేర్చడం కోసం పని చేస్తున్నాం' అని మోడీ పక్కనే ఉండి వ్యాఖ్యానించారు. స్టానీ వ్యాఖ్యాలను ఉదహరిస్తూ మోడీపై సెటైర్లు వేశారు అల్కాలంబ. 'ప్రధానమంత్రి నరేంద్రమోడీ పక్కనే నిల్చొని అన్నారు. గాంధీ కలలు కన్న భవిష్యత్ను సాధిస్తూనే బహుళత్వం, లౌకికవాదాన్ని కూడా సాధించాలన్న నెహ్రూ దూరదృష్టిని ప్రస్తావించారు. ప్రజాస్వామ్య విలువల గురించి ప్రస్తావించారు. మానవ హక్కుల గురించి చెప్పారు. వాళ్లు ఎలాంటి సందేశమిచ్చారో తెలుసా? భారత ముఖ చిత్రాలు నేటికి కూడా గాంధీ, నెహ్రూలే. అంతే కానీ గాడ్సే, సావర్కర్లు కాదు' అని అల్కాలంబ ట్వీట్ చేశారు. కశ్మీర్ సమస్య సహా.. పలు తప్పిదాలకు కారణం భారత తొలి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూనేనని మోదీ వర్గం తరుచూ ఆరోపణలు చేస్తూనే ఉంటుంది. అయితే అమెరికా పర్యటనలో భాగంగా 'గాంధీ ఆశయాలు-నెహ్రూ విజన్ నెరవేర్చడం కోసం పని చేస్తున్నాం' అని అమెరికా వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది.
Mon Jan 19, 2015 06:51 pm