హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో ప్రభుత్వం రవాణా వ్యవస్థకు పకడ్బందీ చర్యలు తీసుకుందని, ప్రయాణికులకు ఎక్కడా ఇబ్బందులు రాకుండా బస్సులు నడుపుతున్నామని తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ స్పష్టం చేశారు. ప్రస్తుతం సరిపడా బస్సులు తిరుగుతున్నాయని.. ఇక నుంచి ఆర్టీసీ బస్సుల్లో ఛార్జీలపై దృష్టి పెడుతున్నామని చెప్పారు. టికెట్ ధర కంటే ఒక్క రూపాయి ఎక్కువ తీసుకున్నా కఠిన చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు. దసరాకి వెళ్లిన ప్రయాణికుల తిరుగు ప్రయాణం కోసం చేస్తున్న ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై మంత్రి అజయ్, రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి, ఆర్టీసీ ఇన్ఛార్జ్ ఎండీ సునీల్ శర్మ బుధవారం అన్ని జిల్లాల ఆర్టీసీ ప్రాంతీయ, డిపో అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. దాదాపు నాలుగు గంటలకుపైగా సుదీర్ఘంగా చర్చించారు. ప్రస్తుతం ప్రయాణికుల రద్దీకి సరిపడా బస్సులు తిప్పుతున్నామని మంత్రి చెప్పారు. కొన్నిచోట్ల టికెట్ ధర కంటే ఎక్కువ తీసుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయని.. ఒక్క రూపాయి కూడా ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం లేదని ప్రయాణికులకు ఆయన సూచించారు. ఆయా రూట్లలో ఉండే ఛార్జీల పట్టికను ప్రతి బస్సులోనూ ఉంచుతామన్నారు. దీని కోసం ప్రతి డిపోలో కంట్రోల్ రూం ఏర్పాటు చేస్తున్నామని, దీనికి డీఎస్పీ స్థాయి అధికారిని ఇంఛార్జ్గా నియమిస్తున్నట్లు చెప్పారు. ఈ నెల 14 నుంచి విద్యాసంస్థలు ప్రారంభం కానుండటంతో.. షెడ్యూల్ ప్రకారం బస్సులను నడుపుతామన్నారు. ప్రతి డిపోలో ఆర్టీసీ కార్మికుల సమ్మెకు ముందు ఎలాంటి టూర్ షెడ్యూల్ ఉండేదో అదే షెడ్యూల్ను దాదాపు శుక్రవారం నుంచి అమలు చేస్తామన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm