ఖమ్మం: తెలంగాణలోని ఆర్టీసీ కార్మికులకు ప్రభుత్వం న్యాయం చేయాలంటూ డ్రైవర్ శ్రీనివాసరెడ్డి ఆత్మహత్య చేసుకోవడంతో కన్నీరు మున్నీరవుతున్న అతని కుటుంబాన్ని కాంగ్రెస్ నాయకురాలు రేణుకాచౌదరి పరామర్శించారు. పెద్దదిక్కు కోల్పోయి అంతులేని దుఃఖంలో ఉన్నవారిని ఓదార్చారు. సీఎం కేసీఆర్ పట్టుదలకు పోకుండా ఇప్పటికైనా సమస్యను పరిష్కరించి.. ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలను నివారించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. లేకపోతే హనుమంతుడు లంకా దహనం చేసినట్లుగా మంత్రి పువ్వాడ అజయ్ కారణంగా అగ్గి రాజుకుని ప్రభుత్వం పతనం కాకతప్పదని హెచ్చరించారు. తల్లి, తండ్రి అన్ని సౌకర్యాలు ఉండగా ఎంతో ధైర్యంగా ఉన్న శ్రీనివాసరెడ్డి ఇతరుల కోసం బలయ్యాడని రేణుకాచౌదరి అన్నారు. కొనఊపరితో ఉన్నప్పుడు కూడా.. తాను పోయినాసరే తోటి కార్మికులు బాగుపడాలని, న్యాయం జరగాలని కోరుకున్నారన్నారు. ఆయన మరణం వమ్ముకాదన్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయాలు పక్కనపెట్టి, పెద్ద మనసుతో ఆర్టీసీ కార్మికులకు న్యాయం చేయాలని రేణుకాచౌదరి విజ్ఞప్తి చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm