సూరత్: గుజరాత్లోని సూరత్లో గల సివిల్ ఆసుపత్రి వైద్యులు 16 రోజుల నవజాత శిశువుకు అత్యంత క్లిష్టమైన సర్జరీని విజయవంతంగా నిర్వహించి కొత్త జీవితాన్ని ప్రసాదించారు. ఈ ఆడ శిశువు యూపీలోని అయోధ్యలో జన్మించింది. అయితే ఆ శిశువుకు ఎక్కడా సరైన వైద్యం అందకపోవడంతో సూరత్లోని సివిల్ ఆసుపత్రికి తీసుకువచ్చారు. న్యూరో సర్జన్ డాక్టర్ జిగర్ షా మాట్లాడుతూ ఆ చిన్నారికి పుడుతున్నప్పుడే ట్యూమర్ ఉందని, అది రోజు రోజుకూ పెరుగుతూ వచ్చిందని తెలిపారు. 16 రోజుల్లో ఆ ట్యూమర్ 4 కిలోలకు పెరిగిపోయి తల బయటకు వచ్చిందని పేర్కొన్నారు. అయితే వైద్యబృందం ఐదు గంటలపాటు అత్యంత క్లిష్టమైన సర్జరీ చేసి ట్యూమర్ను తొలగించిందన్నారు. ప్రస్తుతం ఆ చిన్నారి ఐసీయూలో చికిత్స పొందుతోంది. ఆ శిశువు తండ్రి రాహుల్ మిశ్రా మాట్లాడుతూ ప్రైవేటు ఆసుపత్రిలో ఈ సర్జరీకి రూ. 5 లక్షలు అడిగారని, అయితే ఇక్కడ సాధారణ ఖర్చుతోనే సర్జరీ జరిగిందన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm