హైదరాబాద్ : హైదరాబాద్లోని జీవిక కెమికల్ పరిశ్రమలో పేలుడు సంభవించిన ఘటనలో ఇద్దరు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. జీడిమెట్ల ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్న ఈ పరిశ్రమలో రియాక్టర్ పేలడంతో అగ్నిప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో పరిశ్రమలో 20 మంది కార్మికులు విధుల్లో ఉన్నారు. పేలుడు ధాటికి షెడ్డు కూలిపోయింది. శిథిలాల్లో చిక్కుకుని అంబరీష్, అన్వర్ అనే కార్మికులు మరణించారు. మరో నలుగురికి తీవ్రగాయాలైనట్టు తెలుస్తోంది. ప్రమాద ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకుని వచ్చారు. కాగా, మృతులు బీహార్ కు చెందినవారిగా గుర్తించారు. పేలుడు ధాటికి షెడ్డు శకలాలు అర కిలోమీటరు దూరం వరకు ఎగిరిపడడంతో స్థానికులు భీతిల్లారు.
Mon Jan 19, 2015 06:51 pm