హైదరాబాద్ : పీరియడ్స్లో ఉన్న మహిళలు వంటలు చేసి భర్తకు పెడితే, మరుజన్మలో వ్యభిచారిణులుగా పుడతారట. ఎవరికీ ఈ రహస్యం చెప్పొద్దని ఎందరో మహర్షులు చెప్పినా వినకుండా.. మన అజ్ఞానాన్ని పారదోలడానికి ఓ స్వామీజీ ఈ గొప్ప విషయాన్ని బయటపెట్టారట. ఆయన ఎవరోకాదు స్వామి కృష్ణస్వరూప్ దాస్జీ. ఈయన గుజరాత్లోని స్వామినారాయణ్ భుజ్ మందిర్కు చెందిన ఓ పెద్ద స్వామీజీ. ఇటీవల ఇక్కడి ఓ కాలేజీలోని 68 మంది విద్యార్థినులను ఒక్కొక్కరుగా బాత్రూంలోకి తీసుకెళ్లి, అండర్వేర్లతో సహా దుస్తులు విప్పించి వాళ్లు పీరియడ్స్లో ఉన్నారా? లేదా? అని పరీక్షించిన ఘటన గుర్తుంది కదా. ఆ కాలేజి ఈ స్వామినారాయణ్ మందిర్ శిష్యబృందానికి చెందిందేనట. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మహిళలపై ఇంతలా వివక్ష చూపించడమేంటని దేశం మొత్తం ముక్తకంఠంతో గగ్గోలు పెట్టింది. ఈ గొడవ మర్చిపోయేలోపే స్వామి కృష్ణస్వరూప్ మాట్లాడిన వివాదాస్పద వ్యాఖ్యల ఓ పాత వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమయింది. దానిలో ఆయన మాట్లాడుతూ.. శాస్త్రాల ప్రకారం, పీరియడ్స్లో ఉన్న మహిళ.. భర్తకు వంట చేసి పెడితే ఆమె వచ్చే జన్మలో వేశ్యగా పుడుతుంది. ఆ వంట తిన్న మగాడు ఎద్దులా పుడతాడు' అని వెల్లడించారు. ఈ రహస్యాల గురించి భక్తులకు చెప్పకూడదని ఎందరో మహర్షులు నాకు చెప్పారు. కానీ నేను చెప్పకపోతే మీరు ఎప్పటికీ తెలుసుకోలేరు. అందుకే చెప్తున్నా అంటూ తన ప్రసంగం కొనసాగించారు. ఈ వీడియోపై నెటిజన్లు విమర్శల వర్షం కురిపిస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm