హైదరాబాద్: రాష్ట్రంలో పశు సంపద ఆరోగ్య పరిరక్షణకు పశుసంవర్దకశాఖ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు ఆశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ వెల్లడించారు. అందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఫిబ్రవరి 1 నుంచి నిర్వహిస్తున్న గాలికుంట వ్యాధి నివారణ టీకాల కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోందని అన్నారు. ఈ కార్యక్రమాన్ని మరింత పటిష్టంగా అమలు చేసే ఆలోచనలో భాగంగా పాడి పశువులు కలిగిన రైతులకు , పశువైద్య సిబ్బందికి తగు సూచనలు , సలహాలు ఇవ్వడం కోసం ఈ కార్యక్రమానికి మరింత ప్రాచుర్యం కల్పించేందుకు పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ కార్యాలయంలో రాష్ట్రస్థాయి కాల్సెంటర్(9121213220)ను ఏర్పాటు చేశామని మంత్రి తెలిపారు. ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు ఈ కాల్సెంటర్ సేవలు అందుబాటులో ఉంటాయని అన్నారు. పశుసంపద కలిగిన రైతులు, టీకాలు వేసే కార్యక్రమంలో నిమగ్నమై ఉన్న పశుసంవర్ధకశాఖ సిబ్బంది ఈ కాల్సెంటర్కు ఫోన్చేసి సేవలు, సలహాలను వెంటనే పొంద వచ్చని పేర్కొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm