అనంతపురం: తల్లి తన ముగ్గురు కుమార్తెలతో కలిసి ఆత్మహత్యకు యత్నించిన సంఘటన అనంతపురం జిల్లా పుట్టపర్తిలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు కుమార్తెలు మృతిచెందగా.. తల్లి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. వివరాల్లోకి వెళితే.. అరుణ, రమేశ్ దంపతులు పుట్టపర్తి సమీపంలోని పెదకమ్మవారిపల్లి దొమ్మరపాలెంలో నివాసం ఉంటున్నారు. కుటుంబ కలహాల నేపథ్యంలో తల్లి అరుణ.. కాలనీ సమీపంలో ఉన్న బావిలో ముగ్గురు కుమార్తెలతో కలిసి దూకింది. దీన్ని గమనించిన స్థానికులు హుటాహుటిన స్పందించి వారిని బయటకు తీశారు. ఈ ఘటనలో కుమార్తెలు భవ్య(8), చందన(5) అప్పటికే మృతిచెందగా.. భార్గవి, తల్లి అరుణను ఆసుపత్రికి తరలించారు. అక్కడ భార్గవి(8) చికిత్స పొందుతూ మరణించింది. అరుణ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. భార్గవి, భవ్య ఇద్దరు కవలపిల్లలు. పుట్టపర్తి అర్బన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm