హైదరాబాద్: మిడతల దండు రాష్ట్రంలోకి దూసుకురాకుండా అన్ని రకాల ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని సీఎం కేసీఆర్ వెల్లడించారు. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్ర సరిహద్దులోని జిల్లాల కలెక్టర్లు, పోలీసు అధికారులను అప్రమత్తం చేశామని తెలిపారు. ఫైర్ ఇంజన్లు, జెట్టింగ్ మిషన్లు, పెస్టిసైడ్లను సిద్ధంగా ఉంచామన్నారు. మిడతల దండు కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తున్నామన్నారు. మిడతల దండు తెలంగాణ వైపు వస్తే ఎలా వ్యవహరించాలనే విషయంపై ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. దేశంలో మిడతల దండు ప్రవేశం, ప్రయాణం, ప్రభావంపై అధికారులు, శాస్త్రవేత్తలు, నిపుణులతో చర్చించారు. రాబోయే రోజుల్లో మిడతల దండు ఎటువైపు వెళ్లే అవకాశం ఉందనే విషయంపై ఆరాతీశారు.మిడతల దండు రాష్ట్రంలోకి ప్రవేశించకుండాచూసే చర్యలను పర్యవేక్షించేందుకు ఐదుగురు సభ్యులతో కమిటీ నియమించామన్నారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ సరిహద్దులో మిడతల దండును సంహరించేందుకు గోండియా ప్రాంతంలో పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. అక్కడ కోట్ల సంఖ్యలో మిడతలను చంపగలిగారని, అయినా మిగిలిన కొన్ని మిడతలు మధ్యప్రదేశ్ మీదుగా పంజాబ్ వైపు వెళ్లే అవకాశాలున్నట్లు అంచానాలున్నాయని చెప్పారు. గాలి మరలి ఛత్తీస్గఢ్ మీదుగా తెలంగాణవైపు కూడా రావచ్చని వెల్లడించారు. మిడతల దండు తెలంగాణ వైపు రాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో అధికారులు పూర్తి అప్రమత్తంగా ఉండాలన్నారు. సరిహద్దుల్లోనే పురుగుల మందు పిచికారి చేసి సంహరించాలని అధికారులను ఆదేశించారు.
Mon Jan 19, 2015 06:51 pm