హైదరాబాద్ : సామాజిక మాధ్యమాల్లో తన భార్యను అమ్మకానికి పెట్టాడో భర్త. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్లోని మెహ్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తుథియాలో చోటు చేసుకుంది. అతడిని పోలీసులు అరెస్టు చేసారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... పునీత్ అనే వ్యక్తి తన భార్యను కొంత కాలంగా వేధిస్తున్నాడు. తనకు బైక్ కావాలని, పుట్టింటి వాళ్ల దగ్గర డబ్బులు తీసుకుని తనకు ఇవ్వాలని ఆమెను తీవ్రంగా కొట్టేవాడు. కాగా ఆమె తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లిపోయి అక్కడే ఉంటోంది. దీంతో తన భార్యను అమ్మేస్తానంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రకటించాడు. ఆమె ఫొటోను, ఫోను నంబరును పోస్ట్ చేశాడు. ఆమె కావాలనుకున్న వారు డబ్బులు చెల్లించాలని, ఆమెతో మాట్లాడటానికి, సమయం గడపటానికి తనను సంప్రదించాలని కోరాడు. దీంతో ఆమెకు చాలా మంది నుంచి ఫోన్లు వస్తున్నాయి. చివరకు ఆమె పోలీసులను ఆశ్రయించింది. ఆమె భర్త పునీత్ను అరెస్టు చేసిన పోలీసులు కేసులో దర్యాప్తు జరుపుతున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm