హైదరాబాద్: విదేశీ సిగరెట్లను అక్రమంగా దిగుమతి చేసుకుని.. ఇక్కడ భారీ ధరలకు వాటిని విక్రయిస్తున్న ఐదుగురు సభ్యుల ముఠాను హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు షాహినాయత్ గంజ్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠా సభ్యుల నుంచి కోటి రూపాయాలకు పైగా విలువైన విదేశీ సిగరెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముఠా సభ్యులను బేగంబజార్ కు చెందిన వ్యాపారి విపుల్ రంకా, జగదీష్ కుమార్(చక్నావాడి), ఫర్ఫ్యూమ్ వ్యాపారి శ్రీమాల్(అఫ్జల్ గంజ్), సర్నా ట్రాన్స్ పోర్టు ఉద్యోగి పవన్ కుమార్(గోషామహల్), ఎంఏ హనీఫ్(డెలివరీ ఏజెంట్)గా పోలీసులు గుర్తించారు. సర్నా ట్రాన్స్ పోర్టు ఓనర్ రవీందర్ సింగ్ పరారీలో ఉన్నాడు. విపుల్ రంకా తన వ్యాపారంలో బాగా నష్టపోయాడు. దీంతో విదేశీ సిగరెట్లను దిగుమతి చేసుకుని, భారీ ధరలకు విక్రయించి మోసాలకు పాల్పడుతున్నాడు. ఒక్కో వ్యాపారికి ఒక్కో రేటుకు సిగరెట్లను విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ విదేశీ సిగరెట్లను అక్రమంగా చైనా, మలేషియా, స్విట్జర్లాండ్, దక్షిణ కొరియా నుంచి అక్రమంగా దిగుమతి చేసుకుంటున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm