హైదరాబాద్ : ఇవాళ తెలంగాణ రాష్ట్ర చరిత్రలో బాధాకరమైన రోజని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మూఢ నమ్మకాల కోసం 4 కోట్ల ప్రజలను పణంగా పెట్టారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రభుత్వం తప్పులు చేస్తే న్యాయవ్యవస్థ కలుగజేసుకునేది.. కానీ ఇవాళ న్యాయవ్యవస్థ పై కూడా ప్రజల అసంతృప్తితో ఉన్నారన్నారు. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగే లోపే కూల్చివేత పనులు పూర్తి చేయాలనే ఆలోచనతోనే సచివాలయాన్ని కూల్చుతున్నారని ఆరోపించారు. ఉత్తమ్కుమార్ నివాసం వద్ద కాంగ్రెస్ నేతలు మీడియాతో మాట్లాడారు. తెలంగాణ చరిత్రలో ఇవాళ ఒక బ్లాక్ డే. ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి నిధులు లేవు. కానీ రూ.500 కోట్లతో సచివాలయం నిర్మాణం అవసరమా?. ఒక్క కుటుంబ అవసరాల కోసం తెలంగాణ ప్రజలందరినీ ఇబ్బంది పెడుతున్నారు. సీఎస్ సోమేశ్ కుమార్ కేసీఆర్కు తొత్తుగా మారారు. 20 మంది సీనియర్లను తొక్కి సీఎస్ గా పదవి పొందారు. సోమేశ్ కుమార్ సీఎస్ పదవికి అర్హుడు కాదు. గవర్నర్ పిలుస్తే పోకుండా సీఎస్ రాజ్యాంగాన్ని అవమానించారు. హైదరాబాద్లో కరోనా విజృంభిస్తున్న సమయంలో సీఎం ఎక్కడికి పోయారు. ప్రభుత్వం చూపించే లెక్కలకు క్షేత్ర స్థాయిలో లెక్కలకు చాలా తేడా ఉంది. కేసీఆర్ చీకటి కుట్రలో పాల్గొన్న ఉన్నతాధికారులు ఆత్మపరిశీలన చేసుకోవాలి. కరోనా వ్యాధిని ఆరోగ్యశ్రీ లో చేర్చాలి. లేకపోతే తెలంగాణ కాంగ్రెస్ ఉద్యమం చేస్తుంది. పక్క రాష్ట్రంలో సీఎం జగన్ అద్భుతంగా పనిచేస్తున్నారు. ఏపీలో 10లక్షల పరీక్షలు చేస్తే-తెలంగాణలో లక్ష టెస్టులా? అని ఉత్తమ్ మండిపడ్డారు.
Mon Jan 19, 2015 06:51 pm