హైదరాబాద్ : పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు తప్పకుండా జరుగుతాయని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీ ప్రకటించారు. కోవిడ్-19 నేపథ్యంలో.. ప్రభుత్వం ఆరోగ్యపరమైన అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకుని వీటిని నిర్వహిస్తుందని ఆయన చెప్పారు. హుబ్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. వీటిని వాయిదా వేసే అవకాశాలున్నాయని వచ్చిన వార్తలను తోసిపుచ్చారు. గత మార్ఛి నెలలో కుదించిన బడ్జెట్ సమావేశాల్లో లోక్ సభ 15 బిల్లులను, రాజ్యసభ 13 బిల్లులను ఆమోదించాయి. అనంతరం ఉభయ సభలూ వాయిదా పడ్డాయి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నిర్వహణపై రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా గత జూన్ 1 న సమావేశమై చర్చించారు. భౌతిక దూరాన్ని పాటిస్తూ ఈ సమావేశాల నిర్వహణకు అవకాశం ఉందని వారు అభిప్రాయపడ్డారు. కాగా వర్చ్యువల్ గా వీటిని నిర్వహించవచ్చునని తెలుస్తోంది.
Mon Jan 19, 2015 06:51 pm