Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి సాధుల శ్రీనివాస్
నవతెలంగాణ-డోర్నకల్
జిల్లాలో గిరిజన మంత్రి, ఎమ్మేల్లేలు ఉన్నా అభివృద్ధి మాత్రం శూన్యం అని, డోర్నకల్ మున్సిపాలిటీకి రూ.20 కోట్లు కేటాయించినా అభివృద్ధికి నోచుకోవడం లేదని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి సాధుల శ్రీనివాస్ అన్నారు. బుధవారం మండలంలోని పార్టీ కార్యాలయంలో మండల కమిటీ సమావేశం మండల అధ్యక్షుడు బొమ్మన అశోక్ అధ్యక్షతన నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన పాల్గొని మాట్లాడారు. మహబూబాబాద్ జిల్లాలో మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు అందరు గిరిజనులే ఉన్నా జిల్లా కేంద్రంగా అత్యధికంగా గిరిజనులు 47 శాతం ఉన్నా అభివృద్ధికి నోచుకోవట్లేదన్నారు. ఇప్పటివరకు గిరిజన బడుగు బలహీన వర్గాల విద్యార్థులు చదువుకోడానికి ఒక్క ఇంజినీరింగ్ కాలేజ్ గాని, గిరిజన యూనివర్సిటీ గాని లేదని అన్నారు. ఎన్నికల ప్రచారంలో జిల్లా కేంద్రంగా మెడికల్ కాలేజీ ఇస్తామని, బయ్యారం కేంద్రంగా ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తా మని చెప్పి ఇప్పటి వరకు స్పందించడం లేదన్నారు. జిల్లా యువత నిరుత్సాహంగా ఉన్నారని అన్నారు. డోర్నకల్ మండల కేంద్రంగా జూనియర్ కాలేజీ ఏర్పాటు చేయలేని స్థితిలో పాలకులు ఉన్నారని అన్నారు, ఎమ్మెల్యే మంత్రుల మధ్య పరస్పర గొడవల వల్ల్లే రెండు గ్రూపులుగా చీలిపోయి ప్రజలను మభ్యపెడుతున్నారని అన్నారు. గ్రూపు రాజకీయాలు చేయకుండా డోర్నకల్ మున్సిపాలిటీ అభివద్ధి పథంలో నడిపించేందుకు పాటుపడాలన్నారు. కేంద్రం రైతు వ్యతిరేక చట్టాలు చేసేందుకు, రాష్ట్ర ప్రభుత్వం ఐకేపీ సెంటర్ల ఎత్తివేతకు కుట్రపన్నుతున్నాయన్నారు. జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు శెట్టి వెంకన్న, మండల కార్యదర్శి బొమ్మన అశోక్, అంగొత్ వెంకన్న, ప్రసాద్, మల్లేశం, నాయకులు పాల్గొన్నారు.