Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'కుడా' మాస్టర్ ప్లాన్ ఆమోదం మాటేమిటీ?
నవతెలంగాణ-వరంగల్
రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి, టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వరంగల్ నగర పర్యటనలో 'కుడా' మాస్టర్ప్లాన్పై మాటైనా మాట్లాడలేదు. కాకతీయ అర్భన్ డెవలప్మెంట్ అథారిటీ (కుడా) మాస్టర్ప్లాన్ -2041కు నేటికీ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలుపలేదు. 2017-18 నుండి ఈ మాస్టర్ప్లాన్కు రూపకల్పన చేస్తూనే వున్నారు. గత ఏడాదిగా ఇదిగో.. అదిగో అంటూ వూరించడమే తప్పా నేటికీ ఆమోదముద్ర పడలేదు. మూడేండ్లుగా మాస్టర్ప్లాన్కు ఆమోదం లభించకపోవడం గమనార్హం. ఇదిలావుంటే ఈలోపు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పాలకవర్గం పదవీకాలం సైతం ముగిసింది. గత ఏడాదిలో రాష్ట్ర పురపాలక శాఖమాత్యులు కేటీఆర్ పర్యటన పలు సందర్భాల్లో వాయిదా పడుతూ నేటికీ రాని పరిస్థితి. దీంతో వరంగల్ నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు నేటికీ ప్రారంభోత్సవం జరుగలేదు. పలు కీలకమైన అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయాల్సి వున్నా, చేయకపోవడంతో ఆ పనులు ప్రారంభం కాలేదు.
కాకతీయ అర్భన్ డెవలప్మెంట్ అథారిటీ (కుడా) మాస్టర్ప్లాన్ 2041 నేటికీ ఆమోదముద్ర పడకపోవడం విమర్శలకు తావిస్తుంది. 2017-18లో రూపొందించిన ఈ మాస్టర్ప్లాన్లో అనేక సవరణలు చేసిన అనంతరం ఆమోదముద్ర వేయడానికి ముహుర్తం కుదరడం లేదు. 1,805 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో 181 రెవెన్యూ గ్రామాలను కలుపుతూ ఈ మాస్టర్ప్లాన్ను రూపొందించారు. ఇందులో 80 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం గ్రేటర్ వరంగల్ నగరానికి సంబంధించింది వుంది. మొత్తం 13 మండలాలలో మాస్టర్ప్లాన్ విస్తరించి వుంది. అంతవరకు బాగానే వున్నా, నేటికీ మాస్టర్ప్లాన్కు ఆమోదం తెలుపకపోవడంతో అత్యంత ప్రాముఖ్యమైన అభివృద్ధి పనులకు మోక్షం లేకుండా పోయింది.
మాస్టర్ప్లాన్పై పెదవి విప్పని కేటీఆర్
మంత్రి కేటీఆర్ పర్యటనలో ఆయన ఎక్కడా మాస్టర్ప్లాన్పై పెదవి విప్పకపోవడం నగరవాసులను విస్మయపరిచింది. మంత్రి కేటీఆర్ వరంగల్కు వచ్చి వెళ్లినా, మాస్టర్ప్లాన్కు మోక్షం లభించకపోవడం నగరవాసులను అసంతృప్తికి గురిచేసింది. మాస్టర్ప్లాన్కు ఆమోదం లభిస్తే 5 నియోజకవర్గాలను కలుపుతూ వుండే రీజనల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్) 132 కిలోమీటర్ల మేర నిర్మించాల్సి వుంది. ఇందులో 29 కిలోమీటర్ల రహదారిని జాతీయ రహదారుల శాఖ నిర్మించింది. మరో 68 కిలోమీటర్ల రహదారిని ఆర్ అండ్ బి శాఖాధికారులు నిర్మించాల్సి వుంది. ఈ రహదారి స్టేషన్ఘన్పూర్, వర్ధన్నపేట, హుజురాబాద్, హుస్నాబాద్, పరకాల నియోజకవర్గాలను కలుపుతూ వెళ్తుంది. జాతీయ రహదారుల శాఖ నిర్మించిన 29 కిలోమీటర్ల ఆర్ఆర్ఆర్ రహదారి జాతీయ రహదారి 163కు బైపాస్రోడ్డుగా నిర్మించారు. ఆర్ఆర్ఆర్ పరిధిలోనే ఐటి పార్క్లు, విద్యాసంస్థలు భారతీయ విద్యాభవన్, హైద్రాబాద్ పబ్లిక్ స్కూల్, సైనిక్ స్కూల్ వంటివి రానున్నాయి. ఇండిస్టియల్ జోన్, సెటిలైట్ టౌన్షిప్లను ప్రతిపాదించారు. ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ధర్మసాగర్ మండలంలోని ఎల్కుర్తిలో, దేవునూరు గుట్టలు, ధర్మసాగర్ రిజర్వాయర్ మధ్య రిక్రియేషన్ జోన్ ఏర్పాటు కానుంది. ఇవన్నీ కావాలంటే ముందు మాస్టర్ప్లాన్కు ఆమోదముద్ర లభించాల్సి వుంది. నగరవాసులు ఎంతో ఆశగా ఏండ్ల తరబడి ఎదురుచూస్తున్నా, ఇప్పటికీ ఆమోదముద్ర పడలేదు.
త్వరలో మంత్రి కేటీఆర్ సమావేశం ?
వరంగల్ నగర పర్యటనలో మంత్రి కేటీఆర్ మాస్టర్ప్లాన్కు ఆమోదం తెలుపుతారని భావించినా జరుగలేదు. ఈ పర్యటనకు ముందు రాజధానిలో మాస్టర్ప్లాన్పై సమావేశం తేదీని ఖరారు చేసి మళ్లీ వాయిదా వేశారు. అనంతరం సోమవారం మంత్రి కేటీఆర్ వరంగల్ నగర పర్యటన చేసి వెళ్లారు. ఈ క్రమంలో త్వరలోనే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశముండడంతో ఈలోపు మాస్టర్ప్లాన్పై రాజధానిలో మంత్రి కేటీఆర్ సమావేశం నిర్వహించనున్నట్లు తెలుస్తుంది. ఈ సమావేశానికి ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన మంత్రులతోపాటు, ప్రజాప్రతినిధులు, అధికారులను ఆహ్వానించనున్నట్లు సమాచారం. ఈ సమావేశంలో మాస్టర్ప్లాన్కు ఆమోదం తెలిపే అవకాశముందని విశ్వసనీయ వర్గాల సమాచారం. మాస్టర్ప్లాన్కు ఆమోదంలో ఇప్పటికే తీవ్ర జాప్యం జరిగింది. చాలాసార్లు వాయిదాపడుతూ వచ్చింది. దీంతో నగరాభివృద్ధి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం విమర్శలను ఎదుర్కొంటుంది.
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పాలకవర్గం పదవీకాలం పూర్తయ్యింది. త్వరలోనే ఎన్నికలున్న నేపథ్యంలో ఈలోపు మాస్టర్ప్లాన్ను ఆమోదించకపోతే విపక్షాల నుండి విమర్శలు ఎదుర్కొవాల్సి వస్తుందని టిఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ఆందోళనకు గురవుతున్నారు.