Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తొర్రూరు
ఉపాధి హామీ పనులను స్థానికులు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీఓ గౌస్ కోరారు. మండలంలోని వెలికట్ట గ్రామంలో ఉపాధి హామీ పనులను సర్పంచ్ పోసాని పుష్పలీల సంతోష్తో కలిసి ఎంపీఓ గౌస్ గురువారం పరిశీలించారు. చెరువు పూడికతీత పనులను త్వరగా చేపట్టాలని సూచించారు. అనంతరం ఆయన మాట్లాడారు. ఉపాధి హామీలో మండలాన్ని ఆదర్శంగా నిలపాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. ఉపాధి హామీ పథకం అమలులో పంచాయతీలు క్రీయాశీలక పాత్ర పోషించాలని ఆకాంక్షించారు. పనుల గుర్తింపు, అమలు జరగాలన్నారు. గ్రామసభ ఆమోదించిన పనులనే చేపట్టాలని, పంచాయతీ కార్యదర్శులు పనులపై పర్యవేక్షణ చేపట్టాలని చెప్పారు. అన్ని పంచాయతీల్లో ఉపాధి హామీపై ఫిర్యాదు పెట్టెను ఏర్పాటు చేయాలన్నారు. గ్రామాల్లో హరితహారం, నర్సరీ ల ఏర్పాటు, మొక్కల పెంపకం, చెరువుల పునరుద్ధరణ, పంట కాల్వలు, నీటి సంరక్షణ, తదితర పనులకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. శ్మశానాలు, మరుగుదొడ్లు, వంట గదులు, పంచాయతీ భవనాలు, అంగన్వాడీ భవనాలు, తదితర పనులు చేపట్టాలన్నారు. ఉపాధి కల్పించే వ్యవసాయ అనుబంధ పనులకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. హరితహారంలో భాగంగా చింత, వేప చెట్లను విరివిగా నాటి వాటి సంరక్షణలో సర్పంచ్ లను, కార్యదర్శులను భాగస్వాములను చేయాలని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ నూతన మార్గదర్శకాల అమలులో భాగంగా బయోమెట్రిక్ విధానంలో కూలీల నమోదు, మొబైల్ మానిటరింగ్ సిస్టమ్ చేపట్టాలని స్పష్టం చేశారు. ఉపాధి హామీ పథకంలో అవినీతి చోటు చేసుకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పని ప్రదేశాల్లో కూలీలు, సిబ్బంది మాస్కులు ధరించడంతోపాటు భౌతిక దూరం పాటించాలని చెప్పారు. ఉపాధి హామీ కింద రైతులకు పశువుల కొట్టాలు, చేపల చెరువులు ఉచితంగా తవ్విస్తామని తెలిపారు. పల్లెల్లోని విభిన్న ప్రతిభావంతులకు 150 రోజుల పని దినాలు కల్పిస్తామని వివరించారు. తీగజాతి కూరగాయలు పండించేందుకు రాయితీపై పందిళ్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. మునగతోట ఏర్పాటుకు రైతులను ప్రోత్సహిస్తామని చెప్పారు. మహిళా సంఘాల్లోని సభ్యులు దుకాణం, కూరగాయల వ్యాపారం, గాజుల దుకాణం వంటివి ఏర్పాటు చేసుకొనేందుకు వీలుందన్నారు. నర్సరీల్లోని అన్ని మొక్కలు మొలకెత్తేలా చూడాలని, పూల, పండ్ల మొక్కలు విరివిగా నాటాలని తెలిపారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రాజేశ్వర్, నాయకులు పోసాని రాములు, ఈజీఎస్ సిబ్బంది పాల్గొన్నారు.