Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు
నవతెలంగాణ-సుబేదారి
బాలల హక్కుల పరిరక్షణ కోసం ప్రతిఒక్కరూ అంకిత భావంతో పనిచేయాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అన్నారు, బాలల హక్కుల వారోత్సవాలలో భాగంగా మంగళవారం హనుమకొండ కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఓపెన్ హౌజ్ కార్యక్రమం జిల్లా బాలల పరిరక్షణ అధికారి సంతోష్ కుమార్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. బాలలు జాతీయ సంపదని, వారిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతీ ఒక్క అధికారిపై, స్వచ్ఛంద సంస్థలపై ఉందన్నారు, 18ఏండ్ల లోపు బాల, బాలికల హక్కులకు భంగం కలుగకుండా యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆఫ్ ది రైట్స్ ఆఫ్ ది చిల్డ్రన్, న్యాయచట్టం 2005లు ఉన్నాయన్నారు. ఈ చట్టాల ప్రకారం ప్రతిఒక్కరూ వారి హక్కులను భంగం కలుగకుండా చర్యలు తీసుకోవా లన్నారు. బాలల రక్షణ, సంరక్షణ విభాగాలు బాలల హక్కులపై అవగాహన సదస్సులు నిర్వహించి స్నేహ పూర్వక సమాజ నిర్మాణానికి కృషి చేయాలన్నారు.
కోవిడ్తో పది కుటుంబాల పిల్లలు నిరాశ్రయలయ్యారని, 406మంది పిల్లలు సెమీ ఆర్ఫన్గా గుర్తించి వారికి నిత్యావసరాలను పంపిణీ చేశామని తెలిపారు. అయితే ఇంకా నిరాశ్రయులు, సెమీ ఆర్ఫన్ పిల్లలను గుర్తించుటలో అంగన్వాడి టీచర్లు, ఐసీడీఎస్ సూపర్వైజర్లు, సీడీపీఓలు తదితరులు అప్రమత్తంగా ఉండి వారికి తగు అవసరాలను సమకూర్చాలన్నారు. గతంలో ప్రైవేట్ పాఠశాలలో చదివి ప్రస్తుతం ఫీజులు కట్టలేని పరిస్థితిలో ఉన్న పిల్లలకు, సంబంధిత పాఠశాల యాజమాన్యం వారు ఉచిత విద్య అందించేందుకు జిల్లా విద్యా శాఖాధికారి చర్యలు తీసుకోవాలన్నారు, సంక్షేమ జీవో ఎంఎస్ నంబర్ 47 ప్రకారం వారికి 3శాతం రిజర్వేషన్ వర్తించేలా గురుకులాల కార్యదర్శులతో మాట్లాడి తగు చర్యలు తీసుకుంటామన్నారు. విద్యా, వైద్య సహకారం అందించుటకు నివేదికలు సమర్పించాలని అధికారులను ఆదేశించారు.
చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్ పర్సన్ అన్నమనేని అనిల్ చందర్ రావు మాట్లాడుతూ.. బాల్య వివాహ నిషేధ చట్టం, అక్రమ రవాణా చట్టం, బాల కార్మిక నిషేధ చట్టం, గర్భస్థ లింగ నిర్ధారణ చట్టం, పొక్సో చట్టం పై విస్తత అవగాహన కల్పించి సమాజ మార్పునకు బాలరక్షా అధికారులు కషి చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి ఎం సబిత, డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ యాకూబ్ పాషా, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు, కే దామోదర్, పీ హైమావతి, సీడీపీఓలు, ప్రొటెక్షన్ ఆఫీసర్ ఎస్ ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం కోవిడ్ బాధిత కుటుంబాలకు చెందిన 60 కుటుంబాలకు నిత్యావసర సరుకులను కలెక్టర్ అందజేశారు.