Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మాజీ మంత్రి తక్కళ్లపల్లి పురుషోత్తంరావు
నవతెలంగాణ-కేయూ క్యాంపస్
విద్యార్థులు గాంధీ మార్గంలో పయనిస్తూ కార్ల్స్మార్క్స్ ఆశయాలు సాధించాలని మాజీ మంత్రి తక్కళ్లపల్లి పురుషోత్తంరావు ఆకాంక్షించారు. కాకతీయ విశ్వవిద్యాలయంలోని సెనేట్ హాలులో గాంధీ అధ్యయన కేంద్రం ఆధ్వర్యంలో 'గాంధీతత్త్వం - నేటి సమాజంలో దాని ఆవశ్యకత' అంశంపై గురువారం నిర్వహించిన సదస్సులో ఆయన ప్రసంగించారు. మహాత్మాగాంధీ వ్యక్తిత్వాన్ని వివరించారు. భారతీయ సాంస్కృతిక విలువ ఆధారంగానే గాంధీ వ్యక్తిత్త్వం రూపొందిందని తెలిపారు. సత్యం, అహింస, త్యాగం, ప్రేమ, దయ, కరుణ, తదితర విశ్వజనీన విలువలు ఏ సమాజానికైనా ఆధారభూతమేనని స్పష్టం చేశారు. అవి లోపిస్తే సమాజంలో అశాంతి, హింస పెరిగి మానవ సంబంధాలు దిగజారుతున్నాయని ఆందోళన వెలిబుచ్చారు. కుటుంబ విలువలు క్షీణించడం వల్ల భవిష్యత్ తరాలను ప్రమాదంలోకి నెడుతున్నారని చెప్పారు. నాగరికత పెరగడంతోపాటు సామాజిక, నైతిక విలువలు బలపడాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. కార్ల్మార్క్స్ ఆశించిన సమసమాజ నిర్మాణం కోసం పాటుపడాలని సూచించారు. భారతీయ విలువలను కాపాడుతూ భవిష్యత్ సమాజాన్ని అత్యున్నతంగా నిర్మించాలని ఆకాంక్షించారు. ఇందుకు విద్యావంతులు, యువత బాధ్యత తీసుకోవాలని సూచించారు. కార్యక్రమానికి ప్రొఫెసర్ విజయబాబు అధ్యక్షత వహించగా వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఆర్ సాయన్న, యూనివర్శిటీ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ రవీందర్రెడ్డి, యూజీసీ కో ఆర్డినేటింగ్ ఆఫీసర్ సారంగపాణి, తదితరులు పాల్గొన్నారు.