Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నర్సంపేట
తీజ్ ఉత్సవాలు గిరిజన సాంప్రదాయాలను ప్రతిబింబిస్తాయని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు. పట్టణంలోని 3వ వార్డులో గురువారం తీజ్ ఉత్సవాలలో ముఖ్య అతిధిగా ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గిరిజనులు ప్రత్యేక సంస్కృతి, సాంప్రదాయాలను సమాజానికి పరిచయం చేశాయని అన్నారు. గిరిజన యువతులు తమ జీవిత లక్ష్యాలను చేరుకోవడానికి ప్రతిబింబించే రీతిలో తీజ్ పండుగ వచ్చిందన్నారు. వ్యవసాయ అభివృద్ధితో గిరిజనులు పాలుపంచుకుంటున్నారని వారి కుటుంబాలు సుఖసంతోషాలతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు రుద్ర ఓంప్రకాశ్, పుల్లూరి స్వామి, పెండెం రామానంద్, తదితరులున్నారు.
తీజ్ సంబరాల్లో పెద్ది
పట్టణంలోని రామకృష్ణ కళాశాల ఆవరణంలో, 3వ వార్డులో తీజ్ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ చైర్మన్ పెద్ది సుదర్శన్ రెడ్డి ఈ ఉత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గిరిజన యువతులు సాంప్రదాయ పద్ధతులతో బుట్టలలో ఎదిగిన నారును చేతబూని గిరిజన సాంస్కృతిక ప్రదర్శనలు చేశారు. పలు గిరిజన జానపద గీతాలను ఆలపించారు. ఈ సందర్భంగా పెద్ది మాట్లాడుతూ గిరిజన సంస్కృతి సంప్రదాయాలను ప్రభుత్వం కాపాడుతుందని తీజ్ ఉత్సవాలలో ప్రభుత్వం తగిన గుర్తింపు కూడా ఇస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత గిరిజనులకు రిజర్వేషన్లు పెంచి వారి జీవితాల్లో వెలుగులు నింపాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ సంకల్పించారన్నారు. కార్యక్రమంలో నగరపంచాయతీ చైర్మన్ నాగెల్లి వెంకటనారాయణ గౌడ్, కౌన్సిలర్లు నాయిని నర్సయ్య, మండల శ్రీనివాస్, బండి ప్రవీణ్, పెండెం వెంకటేశ్వర్లు, బండి భారతిరమేష్, కళాశాల ప్రిన్సిపాల్ మాచర్ల రమేష్, టీఆర్ఎస్కేవీ నాయకులు గోనె యువరాజు, పాలడుగుల రమేష్, తదితరులున్నారు.