Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-శాయంపేట
మండలంలోని పత్తిపాక గ్రామంలోని తెల్లమిట్టలో గల ఒర్రెను ఆక్రమించుకుని సాగు చేసుకుంటున్న వారిపై చర్యలు తీసుకోవాలని యువచేతన అధ్యక్షడు పోతుగంటి సాయింరాం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఒర్రెను ఆక్రమించుకుని వరి సాగు చేసుకుంటున్న వారిపై చర్యలు తీసుకోవాలని గురువారం తహశీల్దార్ వెంకటభాస్కర్కు వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్భంగా సాయిరాం మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా భూమి కలిగిన 40 కుటుంబాల రైతులు ఒర్రెమీద ఆధారపడి పంటలు పడిస్తున్నారని అన్నారు. కానీ కొంతమంది రైతులు ఒర్రెను సాగు చేసుకోవడంతో సాగునీరు కింది రైతులకు అందక పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే విషయమై పలుమార్లు వీఆర్వో దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదన్నారు. సాగు చేసుకుంటున్న రైతులను అడిగితే బెదిరింపులకు గురి చేస్తున్నారని, ఇప్పటికైనా అధికారులు స్పందించి ఒర్రెను ఆక్రమించుకుని సాగు చేసుకుంటున్న వారిపై కఠిన చర్యలు తీసుకుని ఆయకట్టు రైతులకు న్యాయం చేయాలని తహశీల్దార్ను కోరారు.ఈ కార్యక్రమంలో డీఎస్వో రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు తుడుం క్రాంతికుమార్ పాల్గొన్నారు.