Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భూపాలపల్లి జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు
నవతెలంగాణ-జయశంకర్ భూపాలపల్లి
ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్ పత్రాలను జాగ్రత్తగా నింపి రిటర్నింగ్ అధికారులకు అందించాలని జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు రాజకీయ పార్టీ నాయకులకు సూచించారు. ఈ నెల 12న రాష్ట్ర రాష్ట్ర శాసనసభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానున్నందున శనివారం జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ ఆర్ భాస్కరన్, జేసీ స్వర్ణలత, భూపాలపల్లి, ములుగు ఆర్డీవోలు వెంకటాచారి, రమాదేవిలతో కలిసి కలెక్టర్ కార్యాలయంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించారు. ఎన్నికల నిబంధనలు అక్టోబర్ 6 నుండే ఎన్నికల నిబంధనలు పూర్తిగా అమల్లోకి వచ్చినందున అన్ని రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ఎన్నికల నిబంధనలను తూచా తప్పకుండా పాటించి ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు సహకరించాలన్నారు. ఈ నెల 12న ఎన్నికల సంఘం శాసనసభ ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వనున్నందున జిల్లాలోని భూపాలపల్లి, ములుగు శాసనసభ నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎన్నికల సంఘం రూపొందించిన నామినేషన్ పత్రాలతో అభ్యర్థులకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని రాసి రిటర్నింగ్ అధికారికి ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు అందించాలని, ఆ పత్రాలలో అభ్యర్థుల నేరచరిత ఉంటే అది కూడా తప్పనిసరిగా తెలియజేయాలన్నారు. ఈ నెల 12 నుండి 19వ తేదీ వరకు ఉదయం 11 నుండి 3 గంటల వరకు ప్రభుత్వ సెలవు రోజుల్లో మినహా మిగతా రోజుల్లో నామినేషన్ వేయాలని, 20న నామినేషన్ పత్రాల పరిశీలన, 22న నామినేషన్ పత్రాల ఉపసంహరణ ఉంటుందన్నారు. ప్రతి అభ్యర్థి తప్పనిసరిగా బూత్స్థాయి ఏజెంట్ను నియించాలన్నారు. అనంతరం ఎస్పీ భాస్కరన్ మాట్లాడుతూ నామినేషన్ సమయంలో అభ్యర్థి వెంట వచ్చే వాహనాలు నిబంధనల మేరకు నిర్ధేశిత ప్రాంతానికి పరిమితం కావాలని, ఎన్నికల్లో ఉపయోగించే వాహనాలకు అనుమతి పత్రాలను అద్దాలకు అతికించాలన్నారు. 11న ఉదయం 9 గంటలకు ఈవీఎం మొదటి స్థాయి ర్యాండమైజేషన్ స్థానిక అంబేద్కర్ మినీ స్టేడియంలో చేపట్టనున్నందున అన్ని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొనాలని కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో భూపాలపల్లి, ములుగు డీఎస్పీలు కిరణ్కుమార్, జె విజయసారథి, కాంగ్రెస్ పార్టీ తరుపున జనార్ధన్రెడ్డి, పోచయ్య, టీఆర్ఎస్ తరుపున ఎస్ అనిల్, రాజిరెడ్డి, బీజేపీ నుండి రాజేందర్, సీపీఐ(ఎం) నుండి రాజయ్య పాల్గొన్నారు.