Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మాజీ మంత్రి అజ్మీరా చందూలాల్
- మహాకూటమితో పేరుతో పగటి వేషగాళ్లు వస్తే తరిమి కొట్టాలి
- ఎంపీ, అజ్మీరా సీతారాంనాయక్
- తెలంగాణ ఉద్యమంలో గొల్ల కురుమల తాగ్యాలు గొప్పవి
- కన్నబోయిన రాజయ్య యాదవ్
నవతెలంగాణ-ములుగు
తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మళ్లీ టీఆర్ఎస్ను అధికారంలోకి తీసుకురావాలని అపద్ధర్మ మంత్రి అజ్మీరా చందూలాల్ అన్నారు. శనివారం డివిజన్ కేంద్రంలోని జాతీయ రహదారిపై గొల్ల కురుమలు డోలు వాయిద్యాలతో నృత్యాలు చేస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. లీలాగార్డెన్స్లో గొల్ల కురుమల ఆత్మీ ఆశీర్వాద సభ నిర్వహించారు. ఈ సభకు మాజీ మంత్రి చందూలాల్తో పాటు ఎంపీ సీతారాంనాయక్, గొల్లకురుమల సహకార సంస్థ చైర్మన్ కన్నెబోయిన రాజయ్య యాదవ్, మాజీ జెడ్పీచైర్మన్ సాంబారి సమ్మారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నాలుగుర్న సంవత్సరాల కాలంలో ప్రతి ఇంటికి ఒక సంక్షేమ పథకం అందించారని తెలిపారు. కేసీఆర్ అహర్నిషలు కృషి చేసి దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపారని తెలిపారు. ఏ రాష్ట్రంలో ప్రవేశపెట్టినా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించారని తెలిపారు. ఈ రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలంటే తిరిగి టీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని, ములుగు నియోజకవర్గంలో కారు గుర్తుకే ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఎంపీ సీతారాంనాయక్ మాట్లాడుతూ మహాకూటమి పేరుతో పగడి వేషగాళ్లు ఓట్ల కోసం ఊర్లలోకి వస్తున్నారని వారు రాష్ట్రాన్ని ఏ మేరకు అభివృద్ధి చేశారో, ఏ ముఖం పెట్టుకుని ఓట్ల కోసం వస్తున్నారో ప్రజలు నిలదీసి వారిని తరిమి కొట్టాలన్నారు. గొల్ల కురుమల సహాకర సంస్థ చైర్మన్ కన్నెబోయిన రాజయ్య యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో గొల్ల కురుమల త్యాగాలు గొప్పవని ఆయన కొనియాడారు. ఉద్యమంలో గొల్ల కురుమలు కీలక పాత్ర పోషించారని, రాష్ట్రంలో గొల్ల కురుమల అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ మొదటి విడత గొర్రెల పంపిణీ కోసం రూ.5 కోట్లు ఖర్చు చేశారన్నారు. రెండో విడత గొర్రెల పంపిణీ కోసం మరో రూ.5 కోట్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం రైతు బంధు పథకానికి రూ.12 కోట్లు ఖర్చు చేస్తే కేవలం గొల్ల కురుమల అభివృద్ధి కోసం రూ.10 కోట్లు ఖర్చు చేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని ఆయన కొనియాడారు. ఈ సమావేశంలో ములుగు మార్కెట్ చైర్మన్ అజ్మీరా ప్రహ్లాద్, రైతు సమన్వయ సమితి జిల్లా కన్వీనర్ పల్ల బుచ్చయ్య, మేడారం ట్రస్టు బోర్డు చైర్మన్ కాక లింగయ్య, ఎంపీపీ భూక్య మంజుల, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, గొల్ల కురుమల సొసైటీ నాయకులు, తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.