Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గత పాలకులు రైతులను విస్మరించారు
- ఎన్నికల ప్రచారంలో మాజీ స్పీకర్ మధుసూదనాచారి
నవతెలంగాణ-భూపాలపల్లి
రైతును రాజు చేయడమే కేసీఆర్ లక్ష్యమని, గత పాలకులు రైతులను పట్టించుకున్న పాపాన పోలేదని తాజా మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం భూపాలపల్లి మండలంలోని ఆజాంనగర్, నాగారం, కమలాపూర్ గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు బోనాలు, బతుకమ్మలతో ఆయనకు ఘనస్వాగతం పలికారు. నాగారంలో ప్రజలు ఎడ్లబండ్లు, బోనాలతో స్వాగతం పలుకగా మధుసూదనాచారి ఎడ్లబండ్లపై తిరుగుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అదేవిధంగా ఆజాంనగర్ గ్రామానికి చెందిన రాజయ్య తన మిర్చి తోటలో గుంటుక కొడుతుండగా స్పీకర్ వెళ్లి నాగలి పట్టి గుంటుక కొట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం రైతు అనుకూల నిర్ణయాలు తీసుకుంటోందని తెలిపారు. గత ప్రభుత్వాల పాలనలో ఎరువులు, విత్తనాల కోసం రైతులు గంటల కొద్ది క్యూలో నిల్చొనేవారని, కానీ తెలంగాణ ఫ్రభుత్వం ఎరువులు, 24 గంటల విద్యుత్ను అందిస్తుందన్నారు. రైతులకు సకాలంలో ఎరువులు, కరెంటును అందించని బకాసుర పార్టీలను భూస్థాపితం చేయాలని పిలుపునిచ్చారు. ప్రజల గురించి పట్టించుకోని కాంగ్రెస్ నేతలు దోచు కోవడానికి నయా నియంతలుగా బయల్దేరారని మండిపడ్డారు. నాగారం గ్రామంలో రూ.5కోట్లతో చెక్డ్యాం నిర్మాణం చేయిస్తానని, గతంలో చేసిన రూ.8.50కోట్ల అభివృద్ధి పనులను వివరించారు.
విరాళాలు అందించిన నాగారం ప్రజలు
ప్రతి రోజూ స్పీకర్ ప్రచారానికి ఆశీర్వాదం అందిస్తూ స్వాగతం పలుకుతున్న ప్రజలు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నాగారం గ్రామానికి చేరుకున్న మధుసూదనాచారికి మాజీ సర్పంచ్ శ్రీలత రూ.5016, మునిగాల రవీందర్ రూ.1016, మునిగాల సత్యం రూ.వెయ్యి, సోతు సత్యం రూ.వెయ్యి చొప్పున ఎన్నికల ఖర్చుల కోసం మధు సూదనాచారికి అందించారు.
ప్రచారానికి సంఘీభావం
ప్రపంచంలో ఎక్కడ చికిత్స లేని జన్యుపరంగా సోకిన అరుదైన డీఎండీ వ్యాధితో బాధపడుతున్న కాజిపేటకు చెందిన 11ఏండ్ల బాలుడు కె.విఘ్నేశ్ మధు సూదనాచారికి సంఘీభావం తెలిపారు. విఘ్నేశ్ తన చివరి కోరికగా సీఎం కేసీఆర్ను చూడాలనే ఆకాంక్షను కొద్దిరోజుల క్రితం వ్యక్తం చేశాడు. విషయం తెలు సుకున్న స్పీకర్ మధుసూదనా చారి సీఎం కేసీఆర్ వద్దకు విఘ్నే శ్ను తీసు కెళ్లారు.కార్యక్రమంలో ఎంపీపీ కల్లెపు రఘుపతిరావు, జెడ్పీటీసీ జర్పుల మీరాబాయి, మండల పార్టీ అధ్యక్షులు మందల రవీందర్రెడ్డి, ఆయా గ్రామాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.