Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాంగ్రెస్లో ఆందోళన
- అభ్యర్థుల ప్రకటనలో తీవ్ర జాప్యం
నవతెలంగాణ-వరంగల్
మహాకూటమికి సంబంధించి వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో ఇంకా అనిశ్చితి కొనసాగుతోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని తొమ్మిది నియోజకవర్గాల్లో అభ్యర్థుల జాబితా ఖరారైపోయిందని సమాచారం. వరంగల్ పశ్చిమ, వరంగల్ తూర్పు, వర్ధన్నపేట నియోజకవర్గాలనే పెండింగ్లో పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. ఇందులో మిత్రపక్షాలైన టీడీపీకి ఒకటి, టీజేఎస్కు రెండు స్థానాలు ఇవ్వనున్నారని ప్రచారం జరుగుతుండడంతో వరంగల్ పశ్చిమ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఇదిలా ఉండగా ఆకస్మికంగా 'పొన్నాల'ను పశ్చిమ బరిలో దింపుతున్నట్లు, జనగామను టీజేఎస్ అధినేత ప్రొఫెసర్ కోదండరాంకు కేటాయించినట్లు ప్రచారం జరగడంతో అటు జనగామలో, ఇటు వరంగల్ పశ్చిమ కాంగ్రెస్లో ఆందోళన తారాస్థాయికి చేరింది.
మహాకూటమిలో భాగంగా మిత్రపక్షాలైన టీడీపీ, టీజేఎస్లకు మూడు స్థానాలు ఖరారయ్యే అవకాశమున్న నేపథ్యంలోనే వరంగల్ పశ్చిమ, వరంగల్ తూర్పు, వర్ధన్నపేట (ఎస్సీ) నియోజకవర్గాలను పెండింగ్లో పెట్టినట్లు ప్రచారంతో వరంగల్ పశ్చిమ నియోజకవర్గం కాంగ్రెస్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. వరంగల్ పశ్చిమ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ టికెట్ను డీసీసీ అధ్యక్షులు నాయిని రాజేందర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్రెడ్డి ఆశిస్తున్నారు. ఎవరికి వారు సీరియస్గా తమ ప్రయత్నాల్లో నిమగమై ఉన్నారు. ఈ క్రమంలో తాజాగా వరంగల్ నగరంలోని వరంగల్ పశ్చిమ, వరంగల్ తూర్పు నియోజకవర్గాలతోపాటు వర్ధన్నపేటను పెండింగ్లో పెట్టడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఇదిలా ఉండగా పీసీసీ మాజీ ఛీఫ్ పొన్నాల లక్ష్మయ్యను వరంగల్ పశ్చిమ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిగా ఖరారు చేయనున్నట్లు ప్రచారం జరగడం, జనగామ నుంచి టీజేఎస్ అధినేత ప్రొఫెసర్ కోదండరాం బరిలోకి దిగుతున్నట్లు చర్చ జరగడంతో అటు జనగామలో, ఇటు వరంగల్ పశ్చిమ కాంగ్రెస్లో కార్యకర్తల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమౌతోంది.
'నాయిని' వర్గం ఆందోళన
వరంగల్ పశ్చిమ నియోజకవర్గాన్ని మిత్రపక్షాలకు కేటాయిస్తే ఊరుకునేది లేదని, కాంగ్రెస్ టికెట్ను డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్రెడ్డికే ఇవ్వాలని ఆయన అనుచరులు ఆందోళన నిర్వహించారు. ఉమ్మడి జిల్లాలో పార్టీ పటిష్టతకు తీవ్రంగా కృషి చేశానని, గత ఎన్నికల్లోనూ చివరి నిమిషంలో పార్టీ టికెట్ చేజారిందని 'నాయిని' తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు ప్రమాదంలో తన కుమారుడిని పోగొట్టుకున్న నేపథ్యంలో రాజకీయాలకు దూరంగా ఉండాలని భావించిన 'నాయిని'కి పార్టీ అండగా ఉంటామని భరోసా ఇచ్చి ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవిని ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ముందస్తు ఎన్నికల్లో వరంగల్ పశ్చిమ టికెట్పై ఆయన ఆశపెట్టుకున్నారు. తీరా రేవంత్రెడ్డితోపాటు మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్రెడ్డి కాంగ్రెస్లో చేరడంతో ఇప్పుడు ఇద్దరి మధ్య పోటీ తీవ్రంగా మారింది.
'నాయిని', 'వేం'ల నడుమ తీవ్ర పోటీ
రేవంత్రెడ్డితో కాంగ్రెస్లో చేరిన 'వేం'కు వరంగల్ పశ్చిమ కాంగ్రెస్ టికెట్కు హామి పొందినట్లు ప్రచారం జరిగింది. ఈ విషయాన్ని 'రేవంత్' వర్గం ధృవీకరించింది. ఇదే క్రమంలో 'వేం'కు వరంగల్ పశ్చిమ నియోజకవర్గం కాంగ్రెస్ టికెట్ ఇప్పించడానికి రేవంత్రెడ్డి ఎఐసిసి నేతలపై తీవ్ర ఒత్తిడి తీసుకువస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. రేవంత్రెడ్డితోపాటు వరంగల్ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు వేం నరేందర్రెడ్డి, సీతక్క, దొమ్మాటి సాంబయ్యలు కాంగ్రెస్లో చేరారు. ఈ సందర్భంగా అధిష్టానం హామినిచ్చిందన్న ప్రచారం జరిగింది. దీంతో వరంగల్ పశ్చిమ నియోజకవర్గానికి 'నాయిని', 'వేం'ల మధ్య పోటీ తీవ్రమైంది.
ఆకస్మికంగా తెరపై 'పొన్నాల'
ఆకస్మికంగా పీసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్యకు వరంగల్ పశ్చిమ కాంగ్రెస్ టికెట్ ఇవ్వనున్నట్లు ప్రచారం జరగడం రాజకీయాల్లో తీవ్రస్థాయిలో చర్చకు దారితీసింది. జనగామ నియోజకవర్గాన్ని టీజేఎస్ అధినేత ప్రొఫెసర్ కోదండరామ్కు కేటాయించినట్లు ప్రచారం జరగడంతో, పొన్నాలకు వరంగల్ పశ్చిమ నుంచి బరిలోకి దింపుతున్నట్లు ప్రచారం కాంగ్రెస్లో ఉద్రిక్తతకు దారితీసింది. ఏది ఏమైనా మహాకూటమి అభ్యర్థులను ఖరారు చేస్తేనే ఈ ప్రచారాలకు తెరపడే అవకాశముంది.
వాయిదాలతో పరేషాన్
మహాకూటమి అభ్యర్థుల అధికారిక ప్రకటన వాయిదాలతో కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్ పార్టీల నేతలు, కార్యకర్తలు పరేషాన్ అవుతున్నారు. ప్రచారానికి నెలరోజులు కూడా గడువు లేకపోవడంతో ఆశావహులు, వారి అనుచరులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికైనా మహాకూటమి నాయకత్వం వెంటనే అభ్యర్థులను ఖరారు చేయాలని కోరుతున్నారు.