Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పార్కు ఏర్పాటుకు నోచుకోని పాలకుర్తి
- వాకర్స్కు ఇబ్బందులు
నవతెలంగాణ-పాలకుర్తి
పాలకుర్తి నియోజకవర్గ కేంద్రం దినదిన అభివృద్ధి చెందుతున్న క్రమంలో ప్రజలకు అందుబాటులో పార్కు లేకపోవటంతో అనేక ఇబ్బందులు పడుతున్నారు. నియోజకవర్గంల పాలకుర్తి రెండో పట్టణంగా ఉంది. అయినప్పటికీ నేటి వరకూ పార్క్ ఏర్పాటుపై అధికారులు దృష్టి పెట్టలేదనే విమర్శలు వస్తున్నాయి. నియోజకవర్గ పరిధిలోగల మానుకోట జిల్లా తొర్రూర్ మండల కేంద్రంలో స్వర్గీయ యతి రాజారావు పేరున పార్కును ఏర్పాటు చేశారు. నియోజకవర్గ కేంద్రంలో ప్రభుత్వ స్థలం ఉన్నప్పటికీ పార్క్ పై దృష్టి పెట్టకపోవటంతో ఆరోగ్యం, ఉల్లాసం కోసం ఉదయం నడకకు వెళ్లే వారు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
పాలకుర్తిని అభివృద్ధి చేసేందుకు సుమారు 22 కోట్ల రూపాయలతో ప్రణాళిక సంఘం నిధులను కేటాయించింది. రాజీవ్ గాంధీ విగ్రహం నుంచి పట్టణానికి నాలుగు వైపులా కిలోమీటర్ మేర వంద ఫీట్ల రోడ్డు విస్తరణ పనులను చేపట్టారు. రూపాయలు 10 కోట్లతో టూరిజం ప్యాకేజీలో పర్యాటక రంగంగా అభివృద్ధి చేసేందుకు నిధులను విడుదల చేశారు. అభివృద్ధి చెందుతున్న పాలకుర్తిలో ప్రజల సౌకర్యార్థం వారికి అందుబాటులో ఉండేందుకు పార్కు లేకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. పాలకుర్తి శివారులో గల కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం సమీపంలో సబ్ స్టేషన్ వద్ద ఉన్న సుమారు ఎకరం భూమిలో పార్కును ఏర్పాటు చేస్తే ప్రజలకు అందుబాటులో ఉంటుంఉదని కోరుకుంటున్నారు. ఆరోగ్య అవసరాల నిమిత్తం ప్రతిరోజు తెల్లవారుజామున నడకతో కిలోమీటర్ల దూరం వెళ్లే ప్రజలు పార్కు లేకపోవడంతో మట్టి రోడ్లపై నడవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నడక దారిలో విష పురుగులు దర్శనమిచ్చిన దాఖలాలు అనేకమున్నాయి.