Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పరకాలరూరల్
పరకాల మండలంలోని 10 గ్రామాల్లో 30 రోజుల కార్యచరణ ప్రారంభమై పదిహేను రోజులు అవుతుండగా.. మొదటి ఐదు రోజులు గ్రామాల్లో సర్పంచులు, కో ఆప్షన్ మెంబర్లు, గ్రామ పాలక వర్గం ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆ తర్వాత కార్యచరణ పనులు నెమ్మదించిన పరిస్థితులే కనిపిస్తున్నాయి. కార్యాచరణలో భాగంగా రోజుకో పని చొప్పున పాల్గొనాలంటే ప్రజలు ముందుకు రావడం లేదని పలు గ్రామాల సర్పంచ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల్లో రైతులు, రైతు కూలీలే ఎక్కువగా ఉండటం మూలాన వారు వ్యవసాయ పనులను వదిలి కార్యాచరణ పనుల్లో పాల్గొనాలంటే ఆసక్తిని ప్రదర్శించటం లేదు. దీంతో 30 రోజుల కార్యాచరణ సర్పంచ్లకు పెద్ద గండంగా పరిణమించిందనే అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తుంటారు. సర్పంచ్లకు చెక్ పవర్ ఇచ్చినా ఎటువంటి నిధులు మంజూరు కాకపోవడం, పదినెలలుగా గ్రామపంచాయతీల్లో పలు కార్యక్రమాల నిర్వహణకు అప్పులు చేసి మరీ ఖర్చు పెట్టి ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న సర్పంచ్లపై 30 రోజుల కార్యాచరణ కార్యక్రమం 'మూలిగే నక్కపై తాటిపండు పడ్డ' చందంగా ఉందని విమర్శకులు అంటున్నారు. అధికారులు 30 రోజుల కార్యాచరణలో చేపట్టిన పనులపై సర్పంచ్లను ఎప్పటికప్పుడు వివరాలు అడుగుతుండటంతో అటు అధికారులకు, ఇటు అప్పులకు భయపడుతూ గ్రామాల్లో అభివద్ధిలో పోటీ పట్ల తీవ్ర ఆందోళనకు గురవుతున్నామని పలువురు సర్పంచ్లు ఏకరువు పెడుతున్నారు. గ్రామ ప్రజల్లోనూ చాలావరకు రోజూ కూలికి వెళ్తేగాని పూటగడవని పరిస్థితుల్లో..కార్యాచరణ పనుల్లో ఎలా పాల్గొనాలని ప్రశ్నిస్తున్నారు. దీంతో చాలా గ్రామాల్లో అధికారులు, సర్పంచ్లు మాత్రమే ఉండి కొన్ని పనులను చేయిస్తుండటం గమనార్హం. గ్రామాల్లో సర్పంచ్ల ప్రణాళికకు పాలకవర్గం కూడా సహకరించకపోవడం ఓ రకంగా 30 రోజుల ప్రణాళిక అమలు తీరు అస్తవ్యస్థంగానే ఉన్నట్టు ప్రస్ఫుటమవుతోంది. ఏదేమైనా ప్రభుత్వం నుంచి సరిపడా నిధులు మంజూరు చేసి పనులకు చేపడితే 30 రోజుల ప్రణాళిక సక్సెస్ అవుతుందనేది అందరి వాదన.