Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సమ్మక్క సాగర్గా నామకరణం త్వరలో ఉత్తర్వులు..
నవతెలంగాణ-వరంగల్
పీవీ నర్సింహారావు కంతనపల్లి సుజల స్రవంతి ప్రాజెక్టు పేరును సీఎం కేసీఆర్ మార్చబోతున్నారు. ఈ మేరకు అధికారులకు ఆదేశాలిచ్చారు. పీవీ పేరును తొలగించి సమ్మక్క సాగర్గా నామకరణం చేయనున్నారు. ఆదివాసీలు, ప్రజాప్రతినిధులు ములుగు జిల్లాకు సమ్మక్క-సారలమ్మ జిల్లాగా నామకరణం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇది పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం కంతనపల్లి ప్రాజెక్టుకు గతంలో పీవీ పేరు పెట్టి ఇప్పుడు తాజాగా తొలగించి, సమ్మక్క పేరును పెట్టడానికి చర్యలు తీసుకుంటున్నారు.త్వరలో ఈ మేరకు ఉత్తర్వులు వెలువడనున్నాయి. ఈ పేరు తొలగింపు విషయంలో టీఆర్ఎస్ నేతలు బహిర్గతంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోయినా అంతర్గతంగా పేరు మార్పుపై చర్చ జరుగుతుంది.పీవీ నర్సింహారావు కంతనపల్లి సుజల స్రవంతి ప్రాజెక్టు విషయంలో ఎలాంటి డిమాండ్లు లేకపోయినా పీవీ నర్సింహారావు పేరు స్థానంలో సమ్మక్క పేరును పెట్టడం చర్చనీయాంశంగా మారింది. కంతనపల్లి ప్రాజెక్టు దేవాదుల ప్రాజెక్టు, ఎస్సారెస్పీ మొదటి, రెండో దశల ఆయకట్టును స్థిరీకరించడానికి నిర్మిస్తున్న విషయం విదితమే. గత కొంత కాలంగా ములుగు జిల్లాకు సమ్మక్క-సారలమ్మ జిల్లాగా నామకరణం చేయాలని స్థానిక శాసనసభ్యురాలు సీతక్కతో పాటు ఆదివాసీ నేతలు కోరుతున్నారు. తాడ్వాయి మండలానికి ఇప్పటికే సమ్మక్క-సారలమ్మ తాడ్వాయి మండలంగా నామకరణం చేసిన విషయం విదితమే. తాజాగా కంతనపల్లి ప్రాజెక్టుకు సమ్మక్క పేరును ఖరారు చేసిన సీఎం కేసీఆర్ ఈ మేరకు ఉత్తర్వులు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.
ఆయకట్టు స్థిరీకరణకే 'కంతనపల్లి'
దేవాదుల ప్రాజెక్టు ఇన్టెక్వెల్ వద్ద 71 మీటర్ల నీటిమట్టం నిలకడగా ఉండేలా చేయడానికి దిగువన 3 కిలోమీటర్ల దూరంలో కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెం వద్ద గోదావరిపై బ్యారేజీని నిర్మిస్తున్నారు. 1,132 మీటర్ల బ్యారేజీ నిర్మాణంతో గోదావరి బ్యాక్ వాటర్ దేవాదుల ప్రాజెక్టు ఇన్టెక్ వెల్ వద్ద 71 మీటర్ల నీటిమట్టం స్థిరంగా ఉండేలా చేస్తుంది. తద్వారా ఏడాది పొడవునా గోదావరి జలాలను లిఫ్టు చేయాలని నిర్ణయించి ఈ బ్యారేజీని నిర్మిస్తున్నారు. ఈ బ్యారేజీ నిర్మాణం పూర్తయితే దేవాదుల ప్రాజెక్టు కిందనున్న 2 లక్షలా 51 వేలా 310 హెక్టార్ల ఆయకట్టు, ఎస్సారెస్పీ మొదటి దశ, రెండో దశల కిందనున్న 3 లక్షలా 4 వేలా హెక్టార్లు, మొత్తంగా 5 లక్షలా 55 వేలా 310 హెక్టార్ల ఆయకట్టును స్థిరీకరించడం సాధ్యమవుతుంది. బ్యారేజీ నిర్మాణంతో 50 టీఎంసీల నీటిని నిరంతరం వినియోగించుకునేలా నిర్ణయించారు. రూ.2,121 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించ తలపెట్టిన ఈ బ్యారేజీ నిర్మాణం వ్యయం అంతకంతకు పెరుగుతుంది. దేవాదుల ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలలను ఇన్టెక్ వెల్ వద్ద 71 మీటర్ల నుండి సముద్ర మట్టానికి 540 మీటర్ల ఎత్తైన ప్రాంతాలకు లిఫ్టు ద్వారా తరలిస్తున్నారు. ప్రతియేటా జూన్-డిసెంబర్ వరకు దేవాదుల ఇన్టెక్వెల్ వద్ద గోదావరి జలాలను లిఫ్టు చేయాల్సి ఉంది. గోదావరి నదిలో వరదలు వచ్చినప్పుడు మినహా ఎప్పుడూ 71 మీటర్ల నీటిమట్టం స్థిరంగా ఉండదు. దీంతో పూర్తిస్తాయిలో లిఫ్టును వినియోగించుకోలేకపోతున్నందునా, ఇన్టెక్వెల్ వద్ద గోదావరి జల మట్టాన్ని 71 మీటర్లకుపైగా ఉండేలా చేయడంలో భాగంగా తుపాకులగూడెం వద్ద బ్యారేజీ నిర్మాణం చేస్తున్నారు.
ఊహించని పేరు మార్పు
కంతనపల్లి బ్యారేజీకి ఇప్పటికే పీవీ నర్సింహారావు పేరు ఉండగా, ఎవరూ ఊహించని విధంగా పీవీ పేరును తొలగించి సీఎం కేసీఆర్ సమ్మక్క పేరు పెట్టడం చర్చనీయాంశంగా మారింది. ములుగు జిల్లా ఏర్పడ్డాక ఈ జిల్లాకు సమ్మక్క-సారలమ్మ జిల్లాగా పేరు పెట్టాలని ఎమ్మెల్యే సీతక్కతోసహా ఆదివాసీ నేతలు డిమాండ్ చేస్తున్న విషయం విదితమే. తాజాగా సీఎం కేసీఆర్ కంతనపల్లి బ్యారేజీకి సమ్మక్క పేరు పెట్టడంతో ములుగు జిల్లాకు సమ్మక్క-సారలమ్మ జిల్లాగా నామకరణం చేసే అవకాశం ఉండదని భావిస్తున్నారు. ఏదేమైనా ఊహించనివిధంగా సీఎం ప్రాజెక్టు పేరు మార్పుపై ఎవరు బహిర్గతంగా వ్యాఖ్యలు చేయకపోయినా, పీవీ కుటుంబం, వారి బంధువులైన 'కెప్టెన్' కుటుంబసభ్యులు ఏ విధంగా స్పందిస్తారనే విషయంలో పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నాయి.