Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రధాని తన విలాసవంతమైన నివాసంలో దిలాసాగా కూర్చుని నెమళ్లకు ఆహారం తినిపిస్తున్న దృశ్యాలు కడు రమణీయంగా మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వణ్యప్రాణుల పట్ల ఆయన ఆదరణకు మురిసిపోవడంలో తప్పులేదు గానీ, ఓట్లేసిన జనం పట్ల నిరాదరణను ఎలా ఒప్పుకుందాం? ప్రజల ప్రాణాలను కరోనాకు వదిలేసి ఖజానాను కార్పొరేట్లకు దొచిపెడుతున్న వైనాన్ని ఎలా అర్థం చేసుకుందాం? దేశంలో కేసుల సంఖ్య 31లక్షలు దాటింది. మరణాల సంఖ్యా 60వేలకు చేరింది. రానున్న రోజుల్లో ఇది ఏ స్థితికి చేరుతుందో తలచుకుంటేనే ఆందోళన కలుగుతోంది. ఇంతటి పెను విపత్తులో మన ఏలికలకు మనుషుల్ని కాపాడేందుకు దారులు కనిపించడం లేదు గానీ, అవినీతికి, ఆశ్రిత పక్షపాతానికి మాత్రం బోలెడు మార్గాలు దొరుకుతున్నాయి. మహమ్మారి సృష్టిస్తున్న విలయంలో ప్రజల ఆరోగ్యాల్ని గాలికొదిలేసిన ఏలికలు, వారి అసరాన్ని మాత్రం అవినీతికి వాడుకుంటున్న తీరు రోత పుట్టిస్తోంది. వెంటిలేటర్ల తయారీలో వేలకోట్ల ఆర్డర్లు అక్రమంగా అస్మదీయులకు కట్టబెట్టిన తాజా ఉదంతం ఇందుకో తిరుగులేని ఉదాహరణ.
వెంటిలేటర్ల తయారీలో ప్రధానికి సన్నిహితమైన కొన్ని గుజరాత్ కంపెనీలు అక్రమంగా ఆర్డర్లు దక్కించుకున్నాయని గతంలోనే పలు ఆరోపణలు వెలువడ్డాయి. ఆ కంపెనీల్లో ''జ్యోతీ సీఎస్సీ'' అనే కంపెనీ ఒకటి. ఈ కంపెనీ తయారు చేసిన 'ధామాన్-1' అనే వెంటిలేటర్ల పనితీరు సరిగా లేదనీ, అవి నాణ్యతలేనివనీ గుజరాత్కే చెందిన అనేక ప్రభుత్వ ఆస్పత్రులు ఫిర్యాదులు చేశాయి. ప్రఖ్యాత ఆహ్మదాబాద్ సివిల్ ఆస్పత్రి సూపరిండెంట్ జె.వి.మోడీ సైతం స్వయంగా ఆ రాష్ట్ర ప్రభుత్వానికి రాసిన లేఖలో ఈ విషయాలన్నీ స్పష్టం చేశారు. అయినప్పటికీ తిరిగి అదే కంపెనీకి కాంట్రాక్టు అప్పగించడమే కాదు, ఆ కంపెనీకి కోట్లాది రూపాయలు అడ్వాన్స్గా చెల్లించడం ఇప్పుడు వివాదాస్పదమైంది.
కోవిడ్-19 చికిత్స నిమిత్తమై దేశ వ్యాపితంగా వివిధ హస్పిటల్స్కు ఇప్పుడు పెద్దఎత్తున వెంటిలేటర్స్ అవసరమున్న మాట వాస్తవం. కానీ ఈ అవసరమే కొన్ని ప్రయివేటు తయారీ సంస్థలకు వరంగా మారిందన్న మాట అంతకు మించిన వాస్తవంగా ఈ పరిణామం రుజువు చేస్తున్నది. గతంలో ఆర్డర్లు దక్కించుకున్న ఏ కంపెనీ ఇప్పటి వరకూ అవసరమైన వెంటిలేటర్లను సరఫరా చేయలేదని ఒకవైపు వార్తలు వస్తుండగా, మరోవైపు సదరు కంపెనీకి కేంద్ర ఆరోగ్యశాఖ వారి 'డైరెక్టరేట్ జనరల్ హెల్త్ సర్వీసెస్ (డీజీహెచ్ఎస్)'' సాంకేతిక కమిటీ ఆమోదం కూడా లేకపోవడం ఇక్కడ గమనార్హం! డీజీహెచ్ఎస్ నేతృత్వంలోని సాంకేతిక కమిటీ మొత్తం 40,350 వెంటిలేటర్లకు తాజాగా ఆమోదం తెలిపింది. ఇందుకోసం వెంటిలేటర్ల ఉత్పత్తికి అయిదు కంపెనీలను కూడా ఎంపిక చేసింది. ఈ ఎంపిక చేసిన కంపెనీలలో ఈ గుజరాత్కు చెందిన ''జ్యోతీ సీఎస్సీ''తో పాటు ఏపీకి చెందిన ''మెడ్టెక్ జోన్'' కంపెనీలకు చోటు లేదు. అయినప్పటికీ వాటికి ఆర్డర్లు ఇవ్వడమే గాక, అడ్వాన్స్ చెల్లింపుల కింద రూ.22.5 కోట్లు ముట్టజెప్పడంలోని మతలబేమిటన్నదే పలు అనుమానాలకు దారితీస్తున్నది.
ఈ నేపథ్యంలో జాతీయ మీడియాలో వెలువడిన కథనాలు ఈ ఉదంతంలో కేంద్రం గుట్టు రట్టు చేస్తున్నాయి. ఈ 'జ్యోతి సీఎస్సీ' కంపెనీ ప్రమోటర్లకు ప్రధాని మోడీతోనే గాక, పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలతో అత్యంత సన్నిహిత సంబంధాలున్నాయనీ, ఆ సంబంధాలే ఆ కంపెనీకి డీజీహెచ్ఎస్ ఆమోదం లేకపోయినా కాంట్రాక్టును కట్టబెట్టాయనీ ఆ కథనాల సారాంశం. ఈ సందర్బంలో మోడీ వాడిన ఖరీదైన సూటు కూడా ప్రస్తావనకు రావడం విశేషం. కొంతకాలం క్రితం ప్రధాని ధరించిన అతి ఖరీదైన (సుమారు పదిలక్షల విలువ) సూటుపై దేశమంతటా చర్చ జరిగిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఆ సూటు కూడా గుజరాత్కే చెందిన వెంటిలేటర్ కంపెనీల ప్రమోటర్లే ప్రత్యేకంగా తయారు చేయించి ప్రధానికి పంపారని ఆ కథనాలు తేల్చిచెప్పడం ఏలినవారి ఆశ్రిత పక్షపాతాన్ని మరింత ఎత్తి చూపుతున్నది.
ఇది మాత్రమే కాదు, ప్రధాని మరో అనుంగు మిత్రుడు అదానీ గ్రూపు ఆఫ్ కంపెనీకి తిరువనంతపురం, జైపూర్, గౌహతి విమానాశ్రయాలను కట్టబెట్టడం మాత్రం చెపుతున్న దేమిటి? మణిపూర్లో మాదకద్రవ్యాల అక్రమ రవాణాలో నిందితుడైన ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యేను నిస్సిగ్గుగా బీజేపీలో చేర్చుకోవడం దేనికి సంకేతం..? అవినీతి, ఆశ్రిత పక్షపాతాలే మోడీగారి ఏలుబడి అని చెప్పడానికి ఇంతకంటే ఉదాహరణలేం కావాలి..? అమాయక ప్రజలకు ఆశలు మాత్రమే కల్పించి అస్మదీయులకు మాత్రం ప్రభుత్వ ఆస్తులను, ఖజానాను అప్పగించడంలో బీజేపీ కాంగ్రెస్ను మించిన ఘనాపాటి అనడానికి దేశంలోని పరిణామాలకు మించిన నిదర్శనాలేం కావాలి? మాటల్లో జనాన్ని మంత్రముగ్ధుల్ని చేస్తూ, ఫొటోల్లో నెమళ్లతో కలిసి ఫోజులు ఇస్తూ ప్రజారక్షకులుగా, సాధు స్వభావులుగా కనిపిస్తూ.. చేతల్లో మాత్రం దేశ సంపదను బడాబాబులకు దోచిపెడుతున్న నేతల అసలు స్వరూపాన్ని ప్రజలు గ్రహించనంత వరకే ఈ ఆటలు. జనం కండ్లు తెరచి పిడికిళ్లు బిగిస్తే ఎంతటి పీఠాలైనా కూసాలు కదలక తప్పదు.