Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''కళ్ళుంటాయి చూడవు.
చేతులుంటాయి పైకి లేవవు
మనుషులుంటారు కానీ, వస్తువులకన్నా హీనమే!'' అంటాడో కవి. అవును నిజమే. కండ్లుంటాయి మన న్యాయదేవతకి కానీ చూడదు. ఇది పాత అవగాహనే, కానీ ఇప్పుడు వినదని కూడా అర్థం చేసుకోవాలి. వినదంటే చెవులు లేవని కాదు, చెవిటిదనీ కాదు, నీ మాట వినదని, నీ గొంతు వినదని, నీ అంటే అన్యాయానికి గురయిన, అత్యాచారానికి గురయిన, అనవసర, అసత్య ఆరోపణకు గురయిన, కుట్ర ద్వారా నేరం మోపబడిన నీ మాటలు వినదుగాక వినదని అవగాహనలోకి రావాల్సిన అగత్యంలోకి నేడు మనం నెట్టబడ్డాం.
ఇక పరిపాలకులకు చేతులుంటాయి. చేతలూ ఉంటాయి. కానీ అవి మన కోసం ఏమీ చేయవు. నెమల్లకు, బాతులకు గింజలు వేయటం, ఆదానీ అంబానీలకు ఆదాయాలు సమకూర్చటానికి తప్ప మిగతా ప్రజలందరినీ వస్తువుల కన్నా హీనంగా చూడటాన్ని బహిరంగంగానే మనం చూస్తున్నాం కదా! కాబట్టి యాభైయేండ్ల క్రితం కవి ఊహ ఎంత వాస్తవంగా దర్శనమిస్తున్నది..! ఆశ్చర్యాన్ని వ్యక్తం చేయటం కాదు, మన మెదళ్ళను తెరిచి చూసి చైతన్యమవ్వాల్సిన సమయం ఇది.
న్యాయమనేది ఇంత అన్యాయంగా మారుతుందని ఎప్పుడూ అనుకోలేదు మనం. సమాజంలో అన్యాయాలు జరుగుతున్నా న్యాయస్థానాలలో ఎంతో కొంత న్యాయం జరుగుతుందని ఇంతకాలం ఎక్కడో ఒకింత ఆశలుండేవి. అవి నేడు నిరాశలుగా మారాయి. న్యాయవ్యవస్థపై అధినాయకుల జోక్యమే కాదు జొరబాటూ సంపూర్ణంగా జరిగిపోతున్న వైనాన్ని చూస్తున్నాం. న్యాయ వ్యవస్థలోని న్యాయమూర్తులకు కూడా న్యాయం జరగలేని దురవస్థకు దాన్ని దిగజార్చడం నేటి పాలకుల దుర్నీతిని తెలుపుతున్నది. పాలక నాయకద్వయం కనుసన్నల్లో న్యాయం భయం భయంగా బంధింపబడుతోంది. ఇది ఒకింత బహిరంగంగానే కనపడుతూ ఉన్నది. గత డెబ్భయిమూడేండ్ల స్వాతంత్య్ర చరిత్రలో న్యాయవ్యవస్థ ఇంత దారుణంగా ఎప్పుడూ లేదు.
ఇటీవల సుప్రీం కోర్టు న్యాయవాది ప్రశాంత్ భూషణ్ న్యాయమూర్తిపై, న్యాయ వ్యవస్థపై చేసిన వ్యాఖ్యలను ఆసరా చేసుకుని ఆయనపై కోర్టు ధిక్కరణ కేసు నమోదు చేసి శిక్షవేసే దిశగా పయినిస్తోంది. ఇది ప్రశ్నించే స్వేచ్ఛను హరించే ప్రయత్నంలో భాగమే. దేశవ్యాపితంగానే గాక ప్రపంచ వ్యాపిత న్యాయ నిపుణులు, న్యాయవాదులు ఈ రకమైన చర్యలను పెద్ద ఎత్తున నిరసిస్తున్నారు. ఇదొక చిన్న విషయంగా మనకు కనపడవచ్చు. కానీ పాలకుల నీతి బాహ్యతను బయట పెడుతున్న ప్రతి సందర్భంలోనూ ఇలాంటి చర్యలకు పాల్పడుతోంది.
కేంద్ర హౌం మంత్రిగా ఉన్న అమిత్షాపైన నడుస్తున్న సోహ్రబుద్దీన్ ఎన్కౌంటర్ కేసులో (అప్పుడు గుజరాత్ హౌం మంత్రిగా ఉన్నాడు) ఆయనగారు ప్రధాన ముద్ధాయిగా ఉన్నాడు. ఆ కేసును విచారించి వాస్తవాలు తెలుసుకుంటున్న న్యాయమూర్తి లోయా అకస్మాత్తుగా హత్యకు గురయ్యాడు. ఇప్పటికీ అది మిస్టరీగానే మిగిలింది. ఇక దేశం మొత్తం సంచలనం కలిగించిన కథువా అత్యాచార సంఘటనలో గిరిజన తెగకు చెందిన ముస్లిం ఎనిమిదేండ్ల బాలిక తరపున ధైర్యంగా వాదిస్తున్న కాశ్మీర్కు చెందిన న్యాయవాది దీపికా రజావత్ను చంపుతామని బెదిరించడం వెనుక వారి ఆలోచనలు ఎంత తీవ్రంగా ఉన్నాయో అర్థమవుతున్నది.
ఈ మధ్య ఢిల్లీలో జరిగిన అల్లర్లలో అక్కడి ప్రజలను మత పరంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన నాయకులపై కేసులు నమోదు చేయాలని ఆదేశించిన హైకోర్టు న్యాయమూర్తిని తెల్లారేసరికి పంజాబ్కు బదిలీ చేయించిన ఘటన మనం చూస్తుండగానే జరిగింది. ఢిల్లీ అల్లర్లలో కారకుల మీద కాకుండా బాధితుల మీదనే కేసులు పెట్టి వేధిస్తున్న తీరు గమనిస్తూనే ఉన్నాం. నిజాయితీగా వ్యవహరిస్తున్న న్యాయమూర్తులపై కావాలని ఆరోపణలు చేయించి, కేసులలో ఇరికించి వారిని దారికి తెచ్చుకునే ప్రయత్నాలూ బహిరంగ రహస్యంగానే ఉన్నాయి. ఇక న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి ఎప్పటి నుంచో ఉన్న పద్ధతికి స్వస్తిపలికి రాజకీయుల అనుకూలురకు ప్రాధాన్యతలు కలిగించడం జరుగుతోంది. అంతేకాదు, న్యాయమూర్తులుగా పాలకులకు అనుకూలంగా వ్యవహరించిన వారికి, వారి పదవీ విరమణానంతరం చట్టసభల్లోకి సీట్లిచ్చి పంపుతున్నారు.
స్వతంత్రంగా వ్యవహరించాల్సిన న్యాయవ్యవస్థను పూర్తిగా తన చెప్పుచేతల్లోకి తెచ్చుకుంటున్నది పాలకవర్గం. రాజ్యాంగ స్ఫూర్తిని, భావప్రకటనా స్వేచ్ఛను, ప్రాథమిక హక్కులను కూడా ఖాతరు చేయని పరిస్థితికి న్యాయవ్యవస్థను దిగజార్చారు. ఏ నేరమూ రుజువు కాకపోయినా ఇంతవరకూ విచారణ కూడా చేపట్టకపోయినా పదమూడుమంది మానవ హక్కుల ఉద్యమకారులను, సామాజిక వేత్తలను, పౌరహక్కుల నేతలను జైళ్ళలో పెట్టి తీవ్ర మానసిక హింసకు గురిచేస్తున్నా కోర్టులు న్యాయం పలకలేకపోతున్నవి. అడవులను విధ్వంసం చేసే బహుళ జాతి సంస్థల కొమ్ముకాస్తూ ఆదివాసీలను కోర్టులు నిర్భంధానికి గురిచేయడం వెనుక నేటి పాలకుల కీలుబొమ్మలుగా మారిన న్యాయవ్యవస్థ దీనావస్థను కనిపిస్తోంది. ''రెండు రెండ్లు నాలుగన్నందుకు గూండాలు గుండ్రాళ్ళు విసిరే సీమలో క్షేమ అవిభాజ్యం అంటే జైళ్ళు నోళ్ళు తెరిచే భూమి''లా మారటాన్ని ఎరుకపరచుకుని ప్రతిస్పందించాల్సి ఉంది.