Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సహజంగానే ప్రకృతితో మానవుడు నిరంతర సంఘర్షణకు లోనవుతాడు. ఈ ప్రక్రియలో అనేక సర్దుబాట్లు చేసుకుంటూ జీవితంలో పురోగమిస్తున్నాడు. కానీ ఎంత ఎదిగినా, అభివృద్ధి చెందినా దోపిడీ, వివక్ష, అన్యాయం మాత్రం నేటికీ బహిరంగంగానే వెక్కిరిస్తున్నాయి. నిలువునా దోచుకునేవాళ్లు నానాటికీ పెరిగిపో తున్నారు. వెరసి అంతరాలు లేని సమాజం కలగానే మిగిలి పోతుండగా.. కరోనా కాలంలో వికృత రూపం దాల్చిన దోపిడీ మనిషి విలువనూ, మానవీయతలనూ మరింత దిగజారుస్తున్నది.
దొంగతనం చేయడం, మోసాలకు పాల్పడటం, డబ్బును కొల్లగొట్టడం ఒక దోపిడీ. ఇందులో ఎవరైనా బాధితులు కావొచ్చు. కానీ కరోనా ఏ క్షణాన అడుగుపెట్టిందో గానీ పీడిత ప్రజల్ని అన్నివిధాలుగా పట్టి పీడిస్తుండగా.. దోపిడీ సైతం అదేస్థాయిలో కొత్తరూపాల్ని సంతరించుకుని పెట్రేగిపోతున్నది. మునుపటి కంటే మూడింతలు ఎక్కువై వికృత పోకడలు పోతున్నది. సామాన్యులను చావనీయకుండా బతకనీయకుండా వేధిస్తున్నది. కార్పొరేట్ ఆస్పత్రులను ఆశ్రయిస్తున్న రోగులను ప్రాణాపాయ స్థితిలో కూడా వదిలిపెట్టడం లేదు. ప్రాణం పోయిన తర్వాత కూడా శవాలపై యాజమాన్యాలు వ్యాపారాలు చేసుకుంటున్నాయి. మొత్తం డబ్బు చెల్లిస్తేగానీ మృతదేహాలను అప్పగించడానికి నిరాకరిస్తున్న వైనాలు కనుమరుగవుతున్న కనీస విలువలకు అద్దం పడుతున్నాయి. దు:ఖ సాగరంలో మునిగిన ఎన్నో కుటుంబాల వ్యథలు ఈ దోపిడీ పర్వాన్ని ఎత్తిచూపుతున్నాయి. పురిటినొప్పులతో వెళ్తున్న ఎంతోమందికి ప్రసవ వేదననే మిగులుస్తున్నాయి. అమ్మతనపు తీయదనాన్ని అనుభవించకుండా వారిని ఆర్థికంగా గుల్ల చేయడమేగాక మానసికంగానూ కుంగదీస్తున్నాయి. ఇటీవల ఎన్నో ఉదంతాలు కరోనా కష్టకాలంలో వెలుగు చూస్తున్నప్పటికీ లాభార్జనే ధ్యేయంగా కార్పొరేటు యజమాన్యాలు కుత్సిత స్వభావంతో వ్యవహరించడం సరికొత్త ఆధునిక దోపిడీగా మారింది.
ఇదొక్కటే కాదు.. అన్ని రకాలుగా అన్ని రంగాల్లోనూ దోపిడీ పర్వం సాగుతున్నది. ప్రధానంగా శ్రమశక్తి విషయంలో ఇది ప్రస్ఫుటమవుతున్నది. పరిశ్రమల్లో నిత్యం చెమటోడ్చే కార్మికులను ఆర్థికంగా, శారీరకంగా దోచుకుంటున్న యాజమాన్యాలు.. సకల భోగాలు అనుభవిస్తుండటం విదితమే. అందుకేనేమో ఉన్నవాడు ఓ స్థాయికి చేరాలంటే శ్రమశక్తి దోచుకోకుండా, ఇతరుల భుజాలపై కాలుపెట్టకుండా ఎదగలేడంటారు. లాభం వచ్చిందంటే కచ్చితంగా పేదోడి శ్రమను దోచుకున్నట్టేనని నిర్వచిస్తారు. కానీ కనీస వేతనాలు చెల్లించలేని పెట్టుబడిదారులు కష్టజీవుల శ్రమతో వచ్చిన 'విలాసాలను' ఎప్పటికీ, ఎన్నటికీ తగ్గించుకోలేరు. తగ్గించుకున్న పరిస్థితి ఇదివరకెన్నడూ ఎరుగము. లాక్డౌన్ సమయంలో మాత్రం నష్టాల సాకుచూపి కార్మికులకూ వారి ఆదాయానికీ కత్తెరింపులు వేయడం మాత్రం విడ్డూరం. లాక్డౌన్ 4.0 దశలో ఉన్నా అదిప్పటికీ అమల్లోనే ఉండటం ఏమనాలి? వలస కార్మికులకు నెలల పాటు తిండి మాత్రమే పెట్టి, వారి శ్రమతో కోట్లకుకోట్లు కొల్లగొట్టిన సంపన్నులు.. నష్టాల బూచీ చూపి వేతనాలు, బకాయిలు ఎగ్గొట్టారు. వారి కుటుంబాలను రోడ్డున పడేటట్టు చేశారు. ఆ సందర్భంగా వలసజీవులు రోడ్లవెంబడి పోతున్న చిత్రాలు మౌనంగానే ఈ దోపిడీ వికృతరూపాన్ని కండ్లకు కట్టాయి.
కష్టసమయాల్లో దన్నుగా నిలవాల్సిన ప్రభుత్వాలు కూడా తరతమ స్థాయిలో ఈ దోపిడీకి వంతపాడటం ప్రస్తుతం మహావిషాదం. కార్పొరేట్ల నుంచి కరోనా సాయంగా పీఎం కేర్స్కు వసూలు చేసిన డబ్బులు ఏం చేశారో ఎవరి వద్దా లెక్కలు లేవు. ఆడిట్ పరిధిలోకి రాకుండా తమదైన చతురతతో చట్టబద్ధత లేకుండా చేసి కోట్లకుకోట్లు సమకూర్చారు. ముద్దుగా పీఎం కేర్స్ అని పేరుపెట్టి ఖాతాల్లో పోగుచేసుకున్నారు. పోనీ.. తిండీ ఉపాధి లేక అలమటిస్తున్న బాధితులకు వాటినేమైనా అందించారా అంటే ఎవరి నోరూ పెగలడం లేదు. క్లిష్ట పరిస్థితుల్లో సామన్య ప్రజానీకానికి ఖర్చుపెట్టారా అంటే అదీ సమాధానం లేని ప్రశ్నగానే మిగిలింది. పౌరుని ఆయుధంగా నిర్వచించే సమాచార హక్కు చట్టానికీ వర్తించకుండా దానిని కొట్టిపారేశారు. ప్రజలు చెల్లించే పన్నులు సైతం జీఎస్టీ పేరుతో నేరుగా చేజిక్కించుకుని రాష్ట్రాల వాటా ఇవ్వకుండా కేంద్రం దోపిడీకి పాల్పడటం అత్యంత హేయం. విపత్కర కాలంలో ఎంతటి క్లేశన్నయినా తట్టుకునేలా ఆపన్నుగా నిలబడాల్సిన పాలకులే ఈ విధంగా ప్రజల సొమ్మును కాజేయపూనుకోవడం ముమ్మాటికీ క్షమార్హం కాదు. ఒక వ్యక్తిని మరొక వ్యక్తి, ఒక జాతిని మరొకజాతి పీడించే సాంఘిక ధర్మం ఇంకానా? అనే ప్రశ్న వేసుకోవాల్సిన తరుణమిది. పెట్టుబడిదారులు కార్మికులను దయగా చూస్తే సరిపోవునా? అసలెందుకిలా జరుగుతుందో తెలుసుకోవడం ముఖ్యమా అన్నది సమాజం ముందున్న సవాల్. ఆ సవాలును అధిగమించే శాస్త్రబద్ధమైన ప్రత్యామ్నాయం వెతికినప్పుడే మహాకవి శ్రీశ్రీ అన్నట్టుగా దోపిడీ ఇకపై చెల్లదూ.. సాగదు...!