Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రైతే రాజు అంటుంటాం. రైతే దేశానికి వెన్నెముక అని కూడా చెబుతుంటాం. ఆహార ఉత్పత్తులను పండించే అన్నదాతకు ఎప్పుడూ కష్టాలు వెన్నంటే ఉంటాయి. విత్తనాల నుంచి ఎరువుల దాకా, గిట్టుబాటు ధర నుంచి పెట్టుబడి వరకు అన్నీ సమస్యలే. అన్నీ ఇబ్బందులే. ఆరుగాలం కష్టపడితేగానీ ఇంట్లో గుమ్మి నిండే పరిస్థితి ఉండదు. రెక్కాడితేగానీ డొక్కాడదు. ప్రకృతికి కోపం వచ్చినా, సర్కారు చిన్న చూపు చూసినా నష్టపోయేది రైతులే. ఇన్ని కష్టాలు, నష్టాల మధ్య సమాజానికి అన్నంపెట్టే రైతులు ఇప్పుడు ఎరువుల కోసం ఎదురుచూడాల్సి వస్తున్నది. ఎరువులు సకాలంలో అందక అవస్థలు పడుతున్న దుస్థితి. అనేక జిల్లాల్లో ఎరువుల కొరత తీవ్రమైంది. రైతులు భారీగా రోడ్డెక్కుతున్నారు. గంటల తరబడి చెమటోడుస్తూ 'క్యూ'లైన్లల్లో నిలబడుతున్నారు. అదను దాటితే అసలుకే మోసం వస్తుందనే ఆందోళనతో ఉన్నారు. కాలంతో నిరంతరం పరిగెత్తుతూ భూమిని నమ్ముకుని సాగుచేసే రైతులు ఇప్పుడు ఎరువుల కోసం ఆందోళన చెందాల్సి వస్తున్నది. ఇంత జరుగుతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చోద్యం చూస్తున్నాయి. రైతుల అవసరాలను ముందస్తుగా గుర్తించి, ప్రణాళికాబద్దమైన చర్యల ద్వారా ఆదుకోవాల్సిన పాలక బీజేపీ, టీఆర్ఎస్ ప్రభుత్వాలు దోబూచులాటకు దిగాయి. మన నేతల హడావుడి తప్ప ఆచరణలో ఫలితాలు కనిపించడం లేదు. దేశాన్ని యూరియా కొరత వేధిస్తుంటే విదేశాలకు బీజేపీ సర్కారు ఎగుమతి చేయడం ఎంతమాత్రం సరికాదు. రాష్ట్రంలో వానాకాలం సీజన్కు భారీగా ఎరువులు అవసరమవుతాయని ప్రభుత్వం తొలుత అంచనా వేసుకున్నా, ఆమేరకు కేంద్రంపై ఒత్తిడి తెచ్చి రాష్ట్రంలోని రైతుల ప్రయోజనాలు నేరవేర్చకుండా టీఆర్ఎస్ సర్కారు నాలుగు లేఖలు, రెండు ఢిల్లీ పర్యటనలతో సరిపెట్టింది. అసలే రాష్ట్ర ప్రభుత్వం నియంత్రిత సాగు విధానాన్ని మందుకు తెచ్చింది. అందులో మేము చెప్పిన పంటలు సాగుచేస్తేనే రైతు బంధు సాయం అందిస్తామనే షరతు పెట్టింది. కాగా ప్రకృతి సహకారం, సమయానుకూలంగా వానలు కురవడంతో కొంత సానుకూలత నెలకొన్న నేపథ్యంలో ఎరువుల కొరత మూలంగా పంటల సాగు ఇప్పుడు రైతులకు సవాల్గా నిలిచింది. రాష్ట్రంలో సాధారణ సాగు విస్తీర్ణం 1.24 కోట్ల ఎకరాలు కాగా, ఈ వానాకాలం సీజన్లో 1.13 కోట్ల ఎకరాల్లో రైతులు పంటలేశారు. దీనికి 22.30లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరం. ఇప్పటివరకు 16.15లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు మాత్రమే రాష్ట్రానికి చేరాయి. దీంతో రాష్ట్రం నలుమూలల నుంచి ఎరువులకోసం రైతుల ఆర్తనాదాలు వినిపిస్తూనే ఉన్నాయి. పడిగాపులుకాసే పరిస్థితులు రోజుల తరబడి కొనసాగుతుండటం గమనార్హం. నిజామాబాద్, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో ఈ సమస్య మరీ తీవ్రంగా ఉంది. ఉన్న కొద్దిపాటి ఎరువుల స్టాక్ను బ్లాక్ మార్కెట్కు తరలించారు. ఈ తరుణంలో రైతుల బాధలు వర్ణణాతీతం. అమ్మబోతే అడవి, కొనబోతే కొరివిలా తయారైంది అన్నదాతల పరిస్థితి. మామూలుగానైతే బస్తా యూరియా రూ. 280గా ఉంటుంది. ఇప్పుడు అక్రమార్కులు బహిరంగ మార్కెట్లో ఇష్టారాజ్యంగా అమ్ముతున్నారు. రైతుల రక్తమాంసాలు పీలుస్తున్నారు. పరిస్థితులను బట్టి బ్లాక్లో రూ.350 నుంచి రూ.500 వరకు యూరియా బస్తాను అమ్ముతున్నారు. దుక్కులు దున్ని పూర్తిస్థాయిలో చదునుచేసి పంటలు ఏపుగా పెరిగే దశలో యూరియా చల్లాల్సి ఉంటుంది. సకాలంలో ఇది అందక రైతులు ఆందోళన, ఆవేదనకు గురవుతున్నారు. సాగు పెరిగిన నేపథ్యంలో ఆ మేరకు ఎరువుల అవసరమూ అధికమవుతుందనే స్పృహా గులాబీ సర్కారుకు ఉన్నా, రైతులకు అందజేయడంలో ఆశించినంత వేగంగా పనిచేయలేదు. గతేడాది ఇదే సమయానికి 14.48 మెట్రిక్ టన్నుల ఎరువుల వినియోగం జరిగిందని వ్యవసాయ శాఖ ధృవీకరించింది. ఈసారి కొరత నేపథ్యంలో దిక్కులు చూస్తున్నారు. సాధారణంగా వాణిజ్య పంటలకు ఎరువులను ఎక్కువగా వాడతారు. ప్రధానంగా మిర్చి, వరి, జొన్న, పత్తి పంటలకు ఉపయోగిస్తారు. దీనికి వ్యవసాయ శాస్త్రవేత్తలు సలహాలు, సూచనలు ఇవ్వాల్సి ఉంటుంది. ఇక ప్రభుత్వం, భూసార పరీక్షలు, హెల్త్కార్డుల సంగతి అటకెక్కింది. సీజన్ ప్రారంభంలో రైతు సదస్సులు నిర్వహించాల్సిన అవసరాన్ని మరిచిపోతున్నారు. రసాయనాలు అధికంగా వాడి పంటలతో పాటు భూమిని దెబ్బతీస్తున్నారనీ అధికారులు చెబుతున్నా, ఆమేరకు రైతుల్లో అవగాహన, చైతన్యం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదేనని గుర్తించాలి. ఎరువుల వాడకంపై కూడా నిరక్షరాస్యులైన రైతులు, రైతు కూలీలు, కౌలు రైతులకు సలహాలు, సూచనలు ఇవ్వడం ద్వారా వినియోగాన్ని తగ్గించాల్సిన పని కూడా సర్కారుదే. యూరియా సరఫరా విషయమై సమీక్షల మీద సమీక్షలు చేసినా కేంద్రం నుంచి తీసుకురాలేకపోయారు. మోడీ ప్రభుత్వం రైతుల విశాల ప్రయోజనాలు మరిచి, బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలకే తొలి ప్రాధాన్యతను ఇస్తూ మిగతా రాష్ట్రాలను నిర్లక్ష్యం చేస్తున్నదన్న విమర్శలున్నాయి. అసలే కరోనా కారణంగా అప్పుల పాలైన రైతులకు ప్రభుత్వాలు విరివిగా ఎరువులను సరఫరా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.