Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కమ్యూనిస్టు చిహ్నాలు అయిన సుత్తీ, కొడవలి వినియోగించిన వారికి తొమ్మిది నుంచి పదిహేనేండ్ల జైలుశిక్ష విధించాలని సెప్టెంబర్ 2న బ్రెజిల్ పార్లమెంటులో ఎడ్వర్డ్ బోల్జానో బిల్లును ప్రవేశపెట్టారు. ఎడ్వర్డ్ స్వయాన దేశాధ్యక్షుడు బోల్సనారో కుమారుడు. వాటిని తయారు చేసినా, విక్రయించినా, పంపిణీ చేసినా శిక్షార్హంగా పరిగణిస్తూ చట్టసవరణకు ప్రతిపాదించారు. దానికి ఆయన చెప్పిన కారణం..
నాజీలు, తరువాత కమ్యూనిస్టులు పోలాండ్ను ఆక్రమించారని, అందువలన వారిని హంతకులుగా పరిగణించాలని, వారి చిహ్నాలను ఉపయోగించిన వారిని శిక్షించాలని బోల్జానో చెప్పారు. కమ్యూనిస్టు చిహ్నాలు విద్వేశానికి చిహ్నాలు అని ఆయన సెలవిస్తూ.. నాజీలు, కమ్యూనిస్టులను ఒకే గాటన కట్టి మాట్లాడారు. కమ్యూనిస్టు లేదా కమ్యూనిస్టు నాయకుల పేర్లతో ఉన్న బహిరంగ స్థలాలు, సంస్థలు, కట్టడాల పేర్లు కూడా మార్చాలని బ్రెజిల్ పాలకులు ప్రయత్నిస్తున్నారు. కమ్యూనిస్టులను అరెస్టు చేసి, హత్య చేయాలని కుట్ర చేస్తున్నారు. ఈ మధ్యలో జరిగిన స్వాతంత్య్రోత్సవాలలో బోల్సనారో మాట్లాడుతూ తనకు నియంతృత్వం అంటే ఇష్టమని బహిరంగంగా ప్రకటించారు. దానికి ప్రతిస్పందనగా ప్రజలు నువ్వు ఫాసిస్టు, అవినీతి పరుడివి, హంతకుడివి అని గట్టిగా నినాదాలు చేశారు.
బ్రెజిల్ పార్లమెంటులో కమ్యూనిస్టు పార్టీకి ఎనిమిది మంది సభ్యులు ఉన్నారు. ఆ దేశంలోని 27 రాష్ట్రాలలో ఒక రాష్ట్రంలో కమ్యూనిస్టులు అధికారంలో ఉన్నారు. అనేక మున్సిపల్ కార్పొరేషన్లలో పార్టీ అధికారంలో ఉన్నది. కరోనాను అరికట్టడంలో బ్రెజిల్ ప్రభుత్వం విఫలమైంది. బియ్యం, పప్పుల ధరల విపరీతంగా పెరిగి ప్రజలు కుటుంబాలను పోషించుకోలేని స్థితికి నెట్టబడ్డారు. ఈ పరిస్థితులను చక్కదిద్దాలని కమ్యూనిస్టులు, కమ్యూనిస్టు యువజన సంఘాలు తీవ్రంగా ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తున్నాయి. ఇది సహించలేని ప్రభుత్వం కమ్యూనిస్టులపై దుష్ప్రచారానికి పూనుకున్నది.
నాజీలు, కమ్యూనిస్టులు ఒకే తానులో గుడ్డలని చెప్పడంలోనే వారి నైజం అర్థమవుతున్నది. 1930లో యూరప్లో కమ్యూనిస్టు ట్రేడ్ యూనియన్లు బలంగా ఉన్న కాలంలో నాజీయిజం ముందుకు వచ్చింది. అది ప్రధానంగా కమ్యూనిస్టు వ్యతిరేకత గల భావజాలం. రెండవ ప్రపంచ యుద్ధంలో కమ్యూనిస్టు రష్యాను అంతం చేయాలని హిట్లర్ నాయకత్వంలో నాజీలు యుద్ధానికి పాల్పడ్డారు. రెండు కోట్ల మంది రష్యన్ల ప్రాణత్యాగాలతో నాజీలను ప్రధానంగా ఓడించింది కమ్యూనిస్టు రష్యా. నాజీలు మితవాద భావజాలానికి ప్రతినిధులు. బోల్సనారో కూడా మితవాది. అమెరికాలో ట్రంప్, బ్రెజిల్లో బోల్సనారో, మనదేశంలో మోడీ ముగ్గురూ మితవాదులే. ఈ త్రయం ప్రపంచ రాజకీయాలను మితవాదం వైపునకు నడుపుతున్నది.
ఈ మధ్యకాలంలో అమెరికాలో రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా ట్రంప్ను నియమిస్తూ జరిగిన సభలో ట్రంప్ మాట్లాడుతూ జోబైడన్ (డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థి) గెలిస్తే అమెరికాలో అరాచకం రాజ్యమేలుతుందని, సోషలిస్టు భావజాలం పుంజు కుంటుందని, అందుకోసం ఎట్టి పరిస్థితిలో బీడన్ను గెలవనీయకూడదని పిలుపునిచ్చారు. మన దేశంలో కూడా మోడీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం కేరళలోని కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే కుట్రలు చేస్తూ, దేశ వ్యాప్తంగా అర్బన్ నక్సల్స్ పేరుతో మేధావులను, లాయర్లను తప్పుడు కేసులు పెట్టి జైళ్ళలో పెడుతున్నారు. ఈ త్రయం పూర్తి కమ్యూనిస్టు వ్యతిరేకతతో విషం కక్కుతున్నది.
నాయా ఉదార విధానాలను అమలు జరుపుతూ కార్పొరేట్ సంస్థల లాభాలు పెద్ద ఎత్తున పెంచేందుకు ఈ త్రయం కంకణం కట్టుకున్నది. కార్మికవర్గం పోరాడి సాధించుకున్న హక్కులను కాలరాస్తున్నది. సంక్షేమ పథకాలను ఉపసంహరిస్తే, కార్మికవర్గాన్ని అణచిపెడితే తప్ప తమ పథకం విజయవంతం కాదని వారికి తెలుసు. అందుకే కార్మికవర్గ పార్టీ అయిన కమ్యూనిస్టు పార్టీపై, దాని చిహ్నాలపై బోల్సనారో దాడికి పూనుకుంటున్నది.
ఇక్కడ ఒక విషయం గమనించాలి. 172 సంవత్సరాల క్రితం అంటే 1848లో మార్క్సు ఎంగిల్స్లు కమ్యూనిస్టు ప్రణాళికను రాసినప్పుడే పెట్టుబడిదారులకు గోరీకట్టేది కార్మికులే అన్న విషయాన్ని ప్రకటించారు. అప్పుడు కార్మికవర్గం అనేది బీజరూపంలోనే ఉన్నది. ప్రపంచ వ్యాప్తంగా కొన్ని లక్షల మంది మాత్రమే ఉండి ఉంటారు. అయినా అది పెరిగేశక్తి అని అప్పుడే వారు గ్రహించి దాని కర్తవ్యాన్ని ప్రబోధించారు. అప్పటి నుంచి కార్మికవర్గంపై అనేక దాడులు జరిగాయి. ఎనిమిది గంటల పనిదినం కోసం జరిగిన పోరాటంలో కాల్పులలో కొంత మంది చనిపోవడం వారి రక్తం నుంచి ఎర్రజెండా పుట్టడం నుంచి రష్యాలో, తూర్పు యూరోప్ దేశాలు, చైనా, క్యూబా, వియత్నాం లాంటి దేశాలలో కమ్యూనిస్టులు అధికారంలోకి రావడం, కొన్ని దేశాలలో ఇప్పటికీ ఉండటం, కొన్నింటిలో విఫలం అవ్వడం మనకు తెలిసిన చరిత్రే.
ఇప్పటికే అనేక దేశాల్లో కమ్యూనిస్టుపార్టీ ఆయా సమాజాలను ప్రభావితం చేసేస్థితిలో ఉన్నది. పెట్టుబడిదారీ సమాజం సంక్షోభంలో పడినప్పుడు ఆ దేశాల పాలకులు కూడా మార్క్స్ రాసిన క్యాపిటల్ చదివి దానిలో బయటపడే మార్గం దొరుకుతుందా అని అన్వేషిస్తున్నారు. దీన్నిబట్టి కమ్యూనిస్టు సిద్ధాంతం విలక్షణత అర్థం అవుతున్నది. బ్రెజిల్లో బోల్సనారో ఆయన కొడుకు కమ్యూనిస్టు చిహ్నాలపై నిషేధం పెట్టినా అంతిమంగా విజయం సాధించేది కార్మికవర్గమే.