Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇంతకు ముందు ''లడ్డూ కావాలా నాయనా?'' అని యాడ్ చూసే వాళ్ళం. ఇప్పుడు దానికి పూర్తి రివర్స్లో ''నుయ్యి కవాలా? గొయ్యి కావాలా? నాయన్లారా'' అని మోడీ సర్కార్ రాష్ట్రాల ముందు రెండు ఆప్షన్లు పెట్టింది. ఇటీవల జరిగిన జీఎస్టీ కౌన్సిల్లో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నీళ్ళులేని నూతిలో పడతారా? లోతైన గోతిలో దూకుతారా? మీరే నిర్ణయించుకోండని చెప్పే సరికి ఖంగుతిన్న రాష్ట్ర ప్రభుత్వాలు వారం రోజుల్లో చెప్తామని కొందరు నసిగితే, ''సమస్యే లేదు! మాసొమ్ము మాకివ్వాల్సిందేన'ని మరికొందరు తెగేసి చెప్పారు. ఇందులోనూ కొందరు ''గోపి''లున్నారని తెలంగాణ ప్రజలకు కొత్తగా చెప్పాల్సిందేమీ లేదు. పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైనాయి. కేసీఆర్ మొన్న వారి పార్లమెంటరీ పక్ష సమావేశంలో కత్తులు దూసినట్టే ఉంది. యుద్ధం చేస్తున్నట్టే ఉంది. ''రాజీ సమస్యే లేదు.'' అని గర్జించింది నిజం అవుతుందా? జీఎస్టీ బకాయిల కోసం కేరళలాగా పోరాటం చేస్తారా? డాన్ క్విక్ సాట్ లాగా ''పదండి! పరాక్రమ వంతులైన యోధులారా! మీ ఆయుధాలను శక్తివంతంగా వాడండి! అని నిద్దర్లోనే కలవరించినట్టు చేస్తారా? లక్షలాది మందిని కదిలిస్తేనే ఈ పోరాటంలో విజయం సాధించగలం.
అసలే ఆర్థిక సంక్షోభ కాలం. దానిపై కరోనా పంజా విసిరింది. అన్ని రాష్ట్రాలూ అప్పుల కుప్పల మధ్య తమ బతుకు బండి లాగుతున్నాయి. ఈ స్థితిలో 2020-21 ఆర్థిక సంవత్సరానికి జీఎస్టీ సెస్ బకాయిలు 3లక్షల కోట్లను ఇవ్వలేమని కేంద్రం చెప్పటం దారుణం. బహిరంగ మార్కెట్లో అప్పులు తెచ్చుకుంటారా? మీరాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)లో ఎఫ్ఆర్బీఎం (ఫిస్కల్ రెస్పాన్సిబులిటి బడ్జెట్ మేనేజ్మెంట్) పరిమితికి 0.5శాతానికి మించి రిజర్వు బ్యాంకుతో అప్పు ఇప్పిస్తాం తీసుకుంటారా? అని కేంద్ర ప్రభుత్వం అడగడం నుయ్యో, గొయ్యో తేల్చుకోండని చెప్పడమే. దీని లోతుల్లోకెళ్ళి చూస్తే - ఒకటి, నయా ఉదారవాదం తలకెక్కిన కాంగ్రెస్, బీజేపీలు సుమారు దశాబ్దం పాటు వివిధ రాజకీయ పక్షాల్ని నయాన్నో, భయాన్నో ఒప్పించుకున్న ఫలితమే నేటి జీఎస్టీ. రెండు, రాష్ట్రాలు రాజ్యాంగ బద్ధంగా వసూలు చేసుకునే అమ్మకం పన్ను, వ్యాట్ వంటి వాటికి అవకాశం ఉండదు కాబట్టి అవి ప్రతి సంవత్సరం 14శాతం పెరుగుతాయనే అంచనాతో ఆ మొత్తాన్ని 2017-18 నుంచి ఐదేండ్ల పాటు 2022 ఆర్థిక సంవత్సరం వరకు జీఎస్టీ సెస్ రూపంలో రాష్ట్రాలకు ఇస్తామని ఒప్పించింది బీజేపీ. అనేక రాష్ట్రాలు జీఎస్టీని ఒప్పుకోవడం వెనకున్న ప్రధాన అంశమిదే. ఇదే జీఎస్టీ (కాంపెన్సేషన్ టు స్టేట్స్) యాక్ట్ 2017 ద్వారా చట్టబద్ధమైంది. పార్లమెంటు చేసిన చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం బుట్టదాఖలు చేయడమే నేటి సమస్య. దీన్నే కేజ్రీవాల్ ''మన పౌరులు ఫలానా పన్ను ఫలానా లెక్కన మీరు చెల్లించాలని అడిగితే తాము చెల్లించలేమని చెప్తే మనం వదిలేస్తామా?'' అని ప్రశ్నించారు. మూడు, 2017-18, 2018-19 ఆర్థిక సంవత్సరానికి 14శాతానికి మించి వసూలైన మొత్తాన్ని కేంద్రం తన 'కన్సాలిడేటెడ్ ఫండు'లో కలిపేసుకుంది. 2019-20లో ఆర్థిక సంక్షోభం ప్రారంభమైంది. అది జీఎస్టీ వసూళ్ళపై ప్రభావం చూపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కోవిడ్ ప్రభావానికి లోనైంది. మొన్నటి దాకా మేకపోతు గాంభీర్యం ప్రదర్శించిన ఆర్థిక మంత్రిత్వశాఖ నేడు చేతులెత్తేసింది. ''ఇవ్వాల్సిన దాన్లో ప్రస్తుతానికి రూ.1.62లక్షల కోట్లు ఇస్తాం, ఇందులో కూడా కేవలం రూ.65వేల కోట్లు కాంపెన్సేషన్ సెస్ ద్వారా బదిలీ చేస్తామని, మిగిలిన 97వేల కోట్లు పైన చెప్పిన రెండు మార్గాల్లో చూసుకోమని ఉచిత సలహా పడేసింది'' అని బిజినెస్లైన్ సంపాదకీయం రాసింది. దీన్నే ముతక భాషలో చెప్పుకోవాలంటే తూర్పు తిరిగి దండం పెట్టమంటోంది. నిర్మలమ్మ మాటల్లో చెప్పాలంటే ''యాక్ట్ ఆఫ్ గాడ్'' అట! 1986లో ప్రపంచ ఫుట్బాల్ ఛాంపియన్షిప్ గెల్చిన తర్వాత అర్జెంటైనా సారధి డీగోమారడోనాను నువ్వు కొట్టిన విజయగోల్ రహస్యమేంటని ప్రశ్నిస్తే ''యాక్ట్ ఆఫ్ గాడ్'' అన్నాడు. ''దేవుడు - మార్కెట్: ఆడమ్స్మిత్ అదృశ్య హస్తం'' అనే పరిశోధనా పత్రంలో 'ముందుచూపు' అర్థంలోనే దేవుడి హస్తం అన్నారనే ఆ పత్రం పేర్కొంది. నిర్మలా సీతారామన్ లాగా ఎగ్గొట్టడానికి ''దేవుడి''పై నెపం నెట్టలేదు.
తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో ప్రపంచమే మునిగి ఉంది. అదేదో మన దేశానికే వచ్చినట్టు కేంద్రం చెప్పటం మోసపూరితం. సహకారాత్మక ఫెడరల్ స్ఫూర్తిని నింపడానికే జీఎస్టీ చట్టం తెచ్చామని ఆనాడు చెప్పారు. నేడు కేంద్ర ప్రభుత్వ చర్య రాజ్యాంగ ఫెడరల్ స్ఫూర్తికే తూట్లు పొడుస్తోంది. అత్యంత పారిశ్రామిక రాష్ట్రం పార్లమెంటు చట్టం చేసిన తర్వాత ఒక రాష్ట్రం తప్పుకోలేదని తెల్సినా మహారాష్ట్ర జీఎస్టీలో నుంచి తప్పుకునే సమయం వచ్చిందని చెప్పడమే దీనికి నిదర్శనం.
కేంద్రమే అప్పుచేసి రాష్ట్రాలకివ్వడం మినహా దీనికి మరోమార్గం లేదు. పరిహారమిచ్చే సమయాన్ని 2022 కంటే పొడిగించవచ్చు. రాష్ట్రాలకు ఇచ్చే ఎస్జీఎస్టీలో వాటా పెంచవచ్చు. కోవిడ్ దెబ్బను ప్రధానంగా కాచుకుంటున్నది రాష్ట్రాలే. పీపీటీ కిట్ల నుంచి వెంటిలేటర్ల వరకూ లేక నానాయాతన పడుతున్నది రాష్ట్రాలే. ఈ దశలో రాష్ట్రాల పొట్టకొట్టడం కేంద్రానికి తగదు.